Thursday, April 25, 2024

జీడిపప్పు ఎగుమతులు పెరిగాయన్న కేంద్రం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఏప్రిల్‌ 2021 నుంచి జనవరి 2022 వరకు 379 మిలియన్‌ డాలర్ల విలువైన జీడిపప్పు ఎగుమతులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ శుక్రవారం రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2021 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే జీడిపప్పు ఎగుమతుల్లో 10 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. జీడిపప్పు ఎగుమతుల ప్రోత్సాహానికి వాణిజ్య శాఖ ట్రేడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎక్స్‌పోర్ట్‌ స్కీమ్‌ (టైస్‌), మార్కెట్‌ యాక్సిస్‌ ఇనిషియేటివ్స్‌ (ఎంఏఐ) స్కీమ్‌ ద్వారా అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. పలాస జీడిపప్పు ప్రాసెసింగ్‌, ఎగుమతులను మరింత పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని జీడిపప్పు ఎగుమతిదార్ల నుంచి తనకు ఎలాంటి విజ్ఞప్తులు అందలేదని అన్నారు.

కోవిడ్‌ మహమ్మారి బారిన పడిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సడలింపులు ప్రకటించిందని అనుప్రియ చెప్పారు. జీఎస్టీ రిటర్న్‌లు ఫైలింగ్‌ గడువులో సడలింపుతో పాటు జీఎస్టీ రీఫండ్‌ ఎప్పటికప్పుడు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణాలు అందుబాటులో ఉండేలా రిజర్వ్‌ బ్యాంక్‌ పలు చర్యలు చేపట్టింది. ఆ రంగం కోసం ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అందులో జీడి పరిశ్రమ కూడా ఉందని ఆమె తెలిపారు. జీడి పరిశ్రమ అవసరాలను తీర్చే విధంగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ కాజూనట్‌, కొకోవా డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ 15 రాష్ట్రాల్లో పలు ప్రోత్సాహక చర్యలను చేపట్టినట్లు చెప్పారు. 2017-18 నుంచి 2021-22 మధ్య కాలంలో దేశంలోని లక్ష హెక్టార్లలో జీడి పరిశ్రమను ఆదుకోవడానికి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement