Thursday, April 25, 2024

దోషులను వదిలేసి… ఆధారాలిచ్చిన ఎమ్మెల్యే పై కేసు.. సిగ్గుచేటు .. బండి సంజయ్

దోషులను వదిలేసి.. ఆధారాలిచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు నమోదు చేయడం సిగ్గుచేటని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. మైనర్ బాలిక ఫోటోలు, వీడియో రిలీజ్ చేయడం నేరమంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ఆబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో దీనిపై స్పందించిన పోలీసులు రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులపై కేసులు నమోదు చేయని పోలీసులు.. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని సంజయ్ ఆరోపించారు. నిందితులకు సంబంధించిన ఆధారాలు ఇచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా.. దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యమని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న తొందర.. దోషులను అరెస్ట్ చేయడంలో చూపితే న్యాయం జరిగేదని సంజయ్ అన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఈ తరహా అత్యాచార ఘటనలు రోజుకో కొత్త కేసు వెలుగు చూడడం రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement