Thursday, April 25, 2024

మూడు రోజులు భగభగలే.. 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో రాబోవు మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శనివారం కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్రవడగాల్పులు, 286 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.1, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44, కృష్ణా జిల్లా నందివాడ, నంద్యాల జిల్లా మహానంది మండలంలో 43.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ధవళేశ్వరంలో అత్యధికం

- Advertisement -

ఈ సీజన్లో మే 16న తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8, ప్రకాశం జిల్లా గుండ్లపల్లిలో 46.7, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 46.5, బాపట్ల జిల్లా అమృతలుర్‌ లో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అప్రమత్తం

ఇప్పటికే ఎండ తీవ్రత నేపధ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, సంబంధిత మండల అధికారులకు హెచ్చరిక సూచనలు జారీచేశామని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. ప్రజలు వారి మండలంలోని ఎండ తీవ్రత ఇతర సమాచారం కోసం విపత్తుల సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్‌ ఏమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్లో టోల్‌ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలని కోరారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్‌ కాకుండా ఉండటానికి మజ్జిగ, నిమ్మకాయ నీరు, కొబ్బరినీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ సూచించారు. మరోవైపు వేసవిలో అక్కడక్కడ ఈదురగాలులతో కురిసే అకాల వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల క్రింద ఉండరాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement