Wednesday, April 24, 2024

మిస్ సింగపూర్‌గా తెలుగు అమ్మాయి నందిత

తెలుగు సంతతి యువతి నందితా బన్నా సింగపూర్ అందాల పోటీల్లో సత్తా చాటింది. ఏపీలో మూలాలు కలిగిన నందిత మిస్ యూనివర్స్ సింగపూర్-2021 అందాల కిరీటం గెలుచుకుంది. సింగపూర్ సిటీలోని నేషనల్ మ్యూజియంలో ఈ పోటీలు నిర్వహించారు. అ పోటీలో నందిత ప్రథమస్థానంలో నిలిచింది. కాగా సింగపూర్ లో జాతివివక్ష వంటి అంశాలను ఎత్తి చూపాలని భావిస్తున్నట్లు నందిత వెల్లడించింది. ఈ ఏడాది ఇజ్రాయెల్‌లో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో నందిత సింగపూర్ కు ప్రాతినిధ్యం వహించనుంది.

ప్రస్తుతం నందిత వయసు 21 సంవత్సరాలు. ఆమె సింగపూర్ లోనే పుట్టి పెరిగింది. ఆమె కుటుంబం పాతికేళ్ల కిందటే సింగపూర్ లో స్థిరపడింది. నందిత తల్లిదండ్రుల పేర్లు మాధురి, గోవర్ధన్. వారి స్వస్థలం శ్రీకాకుళం. నందిత ప్రస్తుతం సింగపూర్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్ మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సు అభ్యసిస్తోంది. కోడింగ్ లోనూ అభిరుచి కలిగిన నందితకు స్కేటింగ్, కుకింగ్, డ్యాన్స్ లోనూ ప్రావీణ్యం ఉంది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ మోడలింగ్ చేస్తున్న నందితకు సామాజిక స్పృహ ఉంది. ఆమె కేర్ కార్నర్ సింగపూర్ అనే స్వచ్ఛంద సంస్థలో వాలంటీరుగా పనిచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement