Saturday, April 20, 2024

వైసీపీ నేతను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

తెలంగాణ పోలీసులు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలను కూడా వదిలిపెట్టడంలేదు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఏపీ నుంచి హైదరాబాద్ వస్తుండగా తెలంగాణ పోలీసులు బోర్డర్ వద్ద అడ్డుకున్నారు. రామాపురం క్రాస్ రోడ్డు వద్ద సత్యనారాయణను నిలిపివేశారు. ఈ-పాస్ లేనిదే తెలంగాణలోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఉమ్మడి రాజధానిలోకి వెళ్లకుండా ఎందుకు నిలిపివేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ పాస్ లేనిదే ఎవరినీ అనుమతించేదిలేదన్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం రాజ్యంగా విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ ఆకుల సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానొక డాక్టర్‌ అని, దేశంలో ఎక్కడికైనా తిరగవచ్చని, ఈ విషయం కూడా తెలంగాణ పోలీసులకు తెలియదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు గన్నవరం వెళతానని, నేరుగా ఫ్లైట్‌లో హైదరాబాద్ వెళతానని, అప్పుడు ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సత్యనారాయణ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement