Thursday, April 25, 2024

Big Story | వెలుగు జిలుగుల తెలంగాణ.. విద్యుత్‌ సరఫరాలో నెంబర్‌వన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ రంగంలో గణనీయమైన పురోగాభివృద్ధి సాధించింది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి పవర్‌ శరవేగంగా అభివృద్ధి సాధించింది. వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తీ.. నేడు దశ దిశలా వ్యాపించింది. ఉమ్మడి రాష్ట్రంలో అంటే 2014కు ముందు విద్యుత్‌ కోతలతో సహా అనేక సమస్యలను రాష్ట్రం ఎదుర్కొన్నది. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టిని సారించి.. విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెట్టడమే కాకుండా విద్యుత్‌ కోతలను అధిగమించి.. మిగులు విద్యుత్‌ దశకు రాష్ట్రం చేరుకున్నది. అంతే కాకుండా వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోంది.

వ్యవసాయ రంగానికి సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.36,890 కోట్లు కూడా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 26.96 లక్షల వరకు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కావడం.. కరెంటు కోతలు, పవర్‌ హాలీడేలకు శాశ్వత ముగింపు ఇచ్చింది. రాష్ట్ర విభజన నాటికి వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 19 లక్షల 2 వేల వరకు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 26 లక్షల వరకు పెరిగింది.

- Advertisement -

18,453 మెగావాట్లకు పెరిగిన విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం..

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను కూడా మెరుగుపర్చింది. నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందిస్తోంది. రాష్ట్ర విభజన నాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యత్‌ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు స్థాపిత సామర్థ్యం 18,453 మెగావాట్లకు పెరిగింది. ఇప్పుడు 16 వేల మెగావాట్లకు పైగా అందుబాటులోకి వచ్చింది. ఈ వేసవిలో 15 వేల మెగావాట్లకు పైగా డిమాండ్‌ వచ్చినా విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. పరిశ్రమలకు ఇచ్చే పవర్‌ హాలీడేలను పుల్‌స్టాప్‌ పెట్టింది. పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంతో కంపెనీలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తుండటంలో వల్ల పారిశ్రామిక కార్మికులకు నిరంతరం ఉపాధి పొందుతున్నారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం రూ.38,070 కోట్లు ఖర్చు చేసింది.

మరో మూడేళ్లలో అదనంగా 12,677 మెగావాట్లు..

తెలంగాణలో పెరిగే విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తిని 28 వేల మెగావాట్లకు తీసుకుపోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. విభజన చట్టంలోని ఇచ్చిన హామీ మేరకు రామగుండంలోని ఎన్‌టీసీసీ ద్వారా 4 వేల మెగావాట్లకు కేంద్రం నుంచి ఆమోదం తీసుకున్నది. ఇప్పటికే మొదటి దశలలో 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. 4వేల మెగావాట్ల యాదాద్రి ప్లాంటు నిర్మాణ పనులు త్వరలోనే పూర్తవుతాయి.

ఛత్తీష్‌గఢ్‌ నుంచి రెండో దశలో మరో 1000 మెగావాట్లు, సింగరేణి నుంచి మరో 800 మెగావాట్లు, సీఎన్‌జీ ద్వారా 90 మెగావాట్లు, సోలార్‌ ద్వారా 1,584 మెగావాట్లు, హైడెల్‌ ద్వారా 90 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. వీటన్నింటి ద్వారా వచ్చే మూడేళ్లలో 12,677 మెగావాట్లు అదనంగా వచ్చి చేరుతుంది. ఇప్పుడున్న కరెంట్‌ను కలుపుకొంటే మూడేళ్ల తర్వాత తెలంగాణలో 28వేల మెగావాట్లకు పైగా స్థాపిత సామర్థ్యానికి చేరుకుంటుంది. దీంతో తెలంగాణ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారుతుంది.

2,126 యూనిట్లకు పెరిగిన తలసరి విద్యుత్‌ వినియోగం..

తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచింది. 2014లో రాష్ట్ర తలసరి విద్యుత్‌ వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేది. అది 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగింది. ఈ ఏడాది మరిన్ని యూనిట్ల వరకు తలసరి వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో జాతీయ సగటున పరిశీలిస్తే 1,255 యూనిట్లుగా నమోదైంది. తెలంగాణ తలసరి వినియోగం, జాతీయ తలసరి వినియోగం కన్నా 69శాతం ఎక్కువగా నమోదైంది. విద్యుత్‌ సరఫరాలో నష్టాలను కూడా అధిగమించింది. 2014లో 16.06 శాతం నుంచి 11.01శాతం వరకు తగ్గింది.

యాదాద్రి, భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం..

రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తిని చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోతల నుంచి మిగులు విద్యుత్‌ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెండు పవర్‌ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. భద్రాద్రిలో 1080మెగావాట్ల సామర్థ్యంతో 4యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. 800మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్తగూడెం ప్లాంట్‌లోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి నిర్మించిన ప్లాంటు కూడా ప్రారంభమైంది.

దీనికి అదనంగా 8,085 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్‌ జెన్‌కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

5,741 మెగావాట్ల సోలార్‌ విద్యుతు ఉత్పత్తి..

ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి సోలార్‌ పవర్‌ కేవలం 74 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో 5,741 మెవాట్ల సోలార్‌ పవర్‌ ఉత్పత్తి జరుగుతున్నది. దీంతో విద్యత్‌ సరఫరాలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలిచిందని ప్రభుత్వం చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement