Friday, March 29, 2024

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ.. అత్యవసర సర్వీసులు ఏవంటే!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది.  రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 20 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. అయితే, అత్యవసర సేవలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి పూట కర్ఫ్యూ పెట్టడం వల్ల లాభమేంటి.. దానిలో ఉన్న లాజిక్ ఏంటి ? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాత్రి సమయంలో చాలా మంది ప్రజలు ఇంట్లోంచి బయటకు వెళ్తారని ప్రభుత్వం చెబుతోంది. నైట్ క్లబ్బులకు, రెస్టారెంట్లలో తినడానికి, రాత్రి సమయంలో ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారని ప్రభుత్వం అంటోంది. ప్రజలు ఇలా బయట తిరగకుండా ఉండేందుకు నైట్ కర్ఫ్యూ పెట్టినట్లు తెలుస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్స్, మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మాసూటికల్స్, నిత్యావసర సరుకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.

నైట్ కర్ఫ్యూలో భాగంగా.. అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, వ్యాపారాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలి. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, మందుల దుకాణాలు, అత్యవసర సేవలందించేవాటికి మినహాయింపు ఉంది. మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసెస్, ఐటీ, ఈ కామర్స్ వస్తువుల పంపిణీ, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లకు కూడా మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా విభాగాలు, వాటర్ సప్లై, శానిటేషన్, కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌజేస్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ లకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు లభించింది.గర్భిణీలు, రోగులు మెడికల్ సేవలు పొందవచ్చు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాల నుండి ఇళ్లకు వెళ్లేవారంతా టికెట్లను చూపాలని ప్రభుత్వం ప్రకటించింది.

నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది. మెడికల్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తమ వెంట గుర్తింపు కార్డులు ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది.  అంతరాష్ట్ర, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు నిత్యావసర, అత్యవసర , ఇతర సరుకుల రవాణా కోసం ఎలాంటి పాసులు అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల తర్వాత ప్రజా రవాణా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ విధించడం వల్ల పబ్ లు, క్లబ్ లు మూతపడనున్నాయి…. వీటి కారణంగానే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నైట్ కర్ఫ్యూను  చేస్తోంది.

కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై  తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  కర్ప్యూ లేదా వీకేండ్ లాక్ డౌన్ విధిస్తారా లేదా తామే నిర్ణయం తీసుకోవాలా అని   హైకోర్టు వ్యాఖ్యానించింది.   48 గంటల్లో ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని  హైకోర్టు ఆదేశించింది. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాత్రి నుండి  నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకొంది. 

దేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. సెకండ్‌ వేవ్‌ తో మరోసారి భారీగా కేసులు పెరుగిపోతున్నాయి. దీంతో ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇటు పలు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. మ‌రోవైపు.. ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో ఉన్న కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూ లాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. పాక్షిక లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement