Thursday, April 25, 2024

కోర్టు ధిక్కరణ చర్యలపై హైకోర్టు ఆగ్రహం

ప్రభుత్వ అధికారుల కోర్టు ధిక్కరణ చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలకు అధికారులు తగిన గౌరవం ఇవ్వడం లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ శిక్ష పడితే అప్పీల్ చేస్తే సరిపోతుందని భావిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసులకే ఇద్దరు ముగ్గురు జడ్జీలను పెట్టాల్సి వచ్చేలా ఉందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆదేశాలను అధికారులు తేలిగ్గా తీసుకుంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది.

సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డిపై కోర్టు ధిక్కరణ కేసు విచారణజరిగింది. ఈ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సంగారెడ్డి అదనపు కలెక్టర్‌పై ఇప్పటివరకు దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుల వివరాలన్నీ  తమ ముందుంచాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్డీవో, తహశీల్దార్‌పై  ఉన్న కోర్టు ధిక్కరణ వివరాలు కూడా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

మరోవైపు నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పై కూడా కోర్టు ధిక్కరణ కేసు విచారణ జరిగింది. సామాజిక సేవ చేయాలని నల్గొండ కలెక్టర్ కు హైకోర్టు ఆదేశించింది. అనాథాశ్రమంలో వారానికి రెండు గంటలు గడపాలని సూచించింది. ఆరు నెలలపాటు అనాథాశ్రమానికి వెళ్లి సేవ చేయాలని పేర్కొంది. ఉగాది, శ్రీరామనవి రోజుల్లో అనాథాశ్రమంలో భోజనాలు పెట్టాలని విశ్రాంత పౌరసరఫరాల జిల్లా అధికారి సంధ్యారాణికి హైకోర్టు ఆదేశించింది. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరికి రూ.2 వేల జరిమానాను సింగిల్ జడ్జి విధించారు. దీంతో సింగల్ జడ్జి ఉత్తర్వులను కొట్టేయాలని ధర్మానసం ఎదుట అప్పీల్ చేశారు. అయితే, సామాజిక సేవ చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు విచారణను ముగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement