Thursday, April 25, 2024

ఫ్రాన్స్‌లో జరగనున్న జిమ్నాసైడ్‌ పోటీలకు తెలంగాణ గురుకుల విద్యార్థులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక సంక్షమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థులు ఫ్రాన్స్‌లో జరగనున్న జిమ్నాసైడ్‌ -2022లో పాల్గొననున్నారు. ఫ్రాన్స్‌లోని నార్మండిలో ఈనెల 14 నుంచి జరిగే అంతర్జాతీయ పాఠశాలల సమాఖ్య, ప్రపంచ పాఠశాలల జిమ్నాసైడ్ 2022 పోటీలకు ఎస్సీ గురుకులాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. డిండి అథ్లెటిక్స్‌ అకాడమీలో ఇంటర్‌ రెండవ సంవత్సరం విద్యార్థిని ఎన్‌. మాయవతి 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటుంది. షేక్‌పేట అథ్లెటిక్స్‌ అకాడమీలో ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్న రవికిరణ్‌ జావెలిన్‌ ట్రో, మొదటి సంవత్సరం విద్యార్థిని కె. ప్రణయ ట్రిపుల్‌ జంప్‌ పోటీల్లో పాల్గొంటారు.

అలాగే చింతకుంట వాలీబాల్‌ అకాడమీలో ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్న లావణ్య కజకిస్థాన్‌లో ఈఏడాది జూలైలో జరిగే అండర్‌ -20 ఏషియా వాలీబాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు ఎంపికయ్యారు. సొసైటీ 24 వివిధ స్పోర్ట్స్‌ అకాడమీలను నడుపుతుండగా, వాటిలోని ఏడుగురు క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో రాణించారు. జాతీయ స్థాయిలో 107 బంగారు, 14 వెండి, 27కాంస్య పతకాలు, రాష్ట్ర స్థాయిలో 344 బంగారు, 234 వెండి, 176 కాంస్య పతకాలు సాధించారు. అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొంటున్న విద్యార్థులను ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అభినందించారు. ఈ పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చి పతకాలతో విజయవంతంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు . తెలంగాణతో పాటు మన గురుకులాల పేరు ప్రఖ్యాతులను ప్రపంచం నలుదిశలా చాటిచెప్పాలని ఆశీర్వదించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement