Monday, March 25, 2024

రాజ‌మౌళి కృషితోనే ఆస్కార్ – త్వ‌ర‌లో తెలంగాణ ప్ర‌భుత్వం సత్కారం..

హైద‌రాబాద్ : ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ అవార్డు రావ‌డంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కృషి ప్ర‌ధానమ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు.. తెలుగు చలనచిత్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన రాజ‌మౌళి బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఘ‌నంగా సన్మానం చేయాలని నిర్ణయించామ‌ని తెలిపారు. మాసాబ్ ట్యాంక్‌లోని ఫిల్మ్ డెవ‌ల‌ప్మ్మెంట్ కార్పొరేష‌న్ కార్యాయంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఫిల్మ్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ అనిల్ కూర్మాచ‌లం, ఈడి కిషోర్ బాబుతో క‌లిసి మాట్లాడుతూ, ఆస్కార్ అవార్డును అందుకున్న ఏకైక తెలుగు చలనచిత్రంగా ఆర్ ఆర్ ఆర్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతుందని చెప్పారు. ఈ చిత్రాన్ని నిర్మించిన డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సినిమా రంగానికి తెలంగాణా కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పారు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటూ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉంటుందని మంత్రి వివరించారు.

సౌత్ సినిమాల పైనా మోడీకి వివ‌క్షే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మొదటి నుండి కూడా దక్షణాది రాష్ట్రాలు అంటే చిన్నచూపు అని మంత్రి విమర్శించారు. ఆస్కార్ అవార్డుల కోసం ఎంట్రీ పంపండి అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా చెలో షో ను ఆస్కార్ ఎంట్రీకి పంపించారని ఆరోపించారు. కానీ వారికి గుణపాఠం చెప్పినట్లుగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఆస్కార్‌కు ఎంపికైనదన్నారు. చిత్ర దర్శకులు రాజమౌళి కృషితోనే ఆస్కార్ అవార్డ్ దక్కిందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement