Wednesday, April 24, 2024

వర్ల రామయ్యను వైసీపీ రౌడీలు బెదిరిస్తున్నారు

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అంశంలో ఎస్ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య న్యాయపోరాటం చేశారు. ఆయనకు అనుకూలంగా తొలుత హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు కూడా వెల్లడించింది. అయితే మరుసటి రోజు హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గురువారం నాడు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వెల్లడించారు. దళిత నాయకుడు, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు వైసీపీ రౌడీలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వివరించారు. ఈ వైఖరిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్‌పై విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని బుద్ధా డిమాండ్ చేశారు. వర్ల రామయ్యకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

అటు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ కరవైందని విమర్శించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని…  వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. వర్ల రామయ్య బెదిరింపు కాల్స్ పై సమగ్ర విచారణ జరిపించాలని, దోషులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వర్ల రామయ్య కుటుంబానికి భద్రత కల్పించాలని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement