Thursday, April 25, 2024

ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి: కనకమేడల

సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. అనంతరం కనకమేడల మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా 29 బిల్లులు, 2 ఆర్థిక అంశాలపై చర్చకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని వెల్లడించారు.

ప్రత్యేక హోదా, విభజన హామీలు, కొవిడ్ పరిస్థితులు, ఎంపీ లాడ్స్ నిధులపై చర్చ జరగాలని కోరామని టీడీపీ ఎంపీ కనకమేడల తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాజీనామాలకు సిద్ధమని టీడీపీ వైఖరి వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎంపీలు తమ పదవులు వదిలేసేందుకు సిద్ధమన్నారు. వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి రాష్ట్రం కోసం పోరాడాలని కనకమేడల స్పష్టం చేశారు.

కాగా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగానే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు విపరీతంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇంకోవైపు కరోనా, వ్యాక్సిన్లు ఇలా పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: మంగ్లీ పాడిన బోనాల పాటపై వివాదం

Advertisement

తాజా వార్తలు

Advertisement