Friday, April 19, 2024

వైసీపీలో లుకలుకలకు, చంద్రబాబుకు ఏంటి సంబంధం?: బుద్ధా వెంకన్న

రఘురామ అరెస్టుకు, టీడీపీ అధినేత చంద్రబాబుకు లింకు పెట్టి మాట్లాడుతున్న వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు జపం చేయనిదే నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. వైసీపీలో ఉన్న లుకలుకలు, అంతర్గత విబేధాలకు చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఎంపీ టిక్కెట్ ఇవ్వమని చంద్రబాబు సీఎం జగన్‌తో చెప్పారా? అని బుద్దా వెంకన్న నిలదీశారు.

రఘురామ ప్రాణాలకు హాని ఉందని స్వయంగా ఆయన కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఆ విషయాన్ని చంద్రబాబుకి అంటగడతారా? అని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే వారి భార్యాపిల్లలు విలపించరా? అని నిలదీశారు. వైసీపీ నేతలకు ఆ మాత్రం కూడా ఇంగితం లేకుండా అన్నింటికీ చంద్రబాబుని అంటారేంటని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా అరెస్టులు, టీడీపీ కార్యకర్తల అరెస్టులు, హత్యలపై చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాయలేదా? అని ప్రశ్నించారు. హత్య రాజకీయాలు, వేధింపులు, కక్ష సాధింపులు, కులాలు, మతాల మధ్య చిచ్చులు పెట్టడం చంద్రబాబుకు తెలియవని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement