Monday, March 25, 2024

పాక్‌లో తాలిబన్ల అరాచకం, పోలీస్‌ స్టేషన్‌పై దాడి… 9మంది భద్రతా సిబ్బంది బందీ

పాకిస్తాన్‌లో తాలిబన్‌ మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. వాయువ్య పాకిస్థాన్‌లో ఖైబర్‌ పక్తూన్‌క్వాలోని ఓ కంటోన్మెంట్‌ ప్రాంత పోలీస్‌ స్టేషన్‌ను పాక్‌ తాలిబన్లు స్వాధీనం చేసుకొన్నారు. తెహక్‌ ఈ తాలిబన్‌ సభ్యులు బన్నూ కంటోన్మెంట్‌లో కొంత భాగాన్ని ఆధీనంలోకి తీసుకొన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాట దళం (సీటీడీ)కు చెందిన 9 మంది భద్రతా సిబ్బందిని సైతం బంధించి, ఆ కేంద్రాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. కొందరు ఉగ్రవాదులను జైళ్ల నుంచి విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో సీటీడీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన తాలిబన్‌ మిలిటెంట్లు ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోను సీటీడీ కాంపౌండ్‌ నుంచి చిత్రీకరించారు.

ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం తమ నియంత్రణలో ఉందని, 9 మంది సిబ్బందిని సైతం తాము బంధించామని ఆ వీడియోలో పేర్కొన్నారు. వాళ్లను విడిచిపెట్టాలంటే, తమను క్షేమంగా దేశం దాటించి, ఆఫ్ఘనిస్తాన్‌ చేరేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకోసం ఒక హెలికాప్టర్‌ సిద్ధం చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఈ ఉగ్రదాడి గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పాకిస్తాన్‌ సైన్యం రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి.. తాలిబన్ల చెర నుంచి అధికారుల్ని విడిపించేందుకు ప్రయత్నిస్తోంది.

ఆదివారం నుంచి ఈ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇంతవరకూ బయట నుంచి ఎలాంటి ఫైరింగ్‌ జరపలేదని పాక్‌ అధికారులు చెప్తున్నారు. ఉగ్రవాదులతో చర్చలు జరిపి, వారి డిమాండ్లు ఏంటో తెలుసుకుంటున్నారు. తాము మొత్తం కంటోన్మెంట్‌ని చుట్టముట్టామని, బన్ను జిల్లాలో ఇంటర్నెట్‌ సేవల్ని సైతం ఆపేశామని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement