Saturday, April 20, 2024

‘పార్లమెంటు’ వ్యాజ్యం విచారణకు సుప్రీం నిరాకరణ

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగేలా లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాజ్యాన్ని పరిశీలించింది. పిటిషన్‌ దాఖలు వెనుక ఉద్దేశం కోర్టుకు తెలుసని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద దీన్ని విచారించేందుకు నిరాకరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టంచేసింది. దీంతో ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటానని పిటిషన్‌దారు విజ్ఞప్తి చేయగా, ధర్మాసనం అంగీకరించింది.

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం ద్వారా లోక్‌సభ సెక్రెటేరియట్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషన్‌దారు అంతకుముందు తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 28న ప్రధాని మోడీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే, రాష్ట్రపతి లేకుండా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని విపక్షాలు నిలదీస్తున్నాయి. దీనికి తాము హాజరుకాబోమంటూ ఇప్పటికే 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement