Tuesday, March 26, 2024

సుప్రీం కీలక నిర్ణయం, సహజీవన సంతానానికి ఆస్తి హక్కు

స్త్రీ పురుషుల సహజీవనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు దాయాదుల మధ్య ఆస్తి విభజన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ తీర్పు నిచ్చింది. దీర్ఘకాలిక సహజీవనం వివాహ సంబంధమంత బలమైనదే అని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. సహజీవనం చేస్తే పెళ్లి చేసుకున్నట్లేనని, సహజీవన బంధాన్ని వివవాహంగానే పరిగణిస్తారని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. అంతేకాకుండా సహజీవనంలో కలిగే పిల్లలకు వారసత్వపు ఆస్తిలో వాటా ఉంటుందని పేర్కొంది. 2009లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తాజాగా కొట్టివేస్తూ ఈ తీర్పు వెల్లడించింది. చాలా సంవత్సరాల పాటు వివాహ బంధానికి, సహజీవనానికి ఒకేవిధమైన చట్టం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది.

ఈ ఊహను తిప్పి కొట్టగలిగినప్పటికీ వారి సహజీవనం సమయంలో వివాహం లేదా వివాహం జరిగిందని తిరస్కరించాలని కోరుకునే వ్యక్తిపై భారం ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్‌నాథ్‌, ఎస్‌.అబ్దుల్‌నజీర్‌లోకూడిన ధర్మాసనం కేరళ హైకోర్టు తీర్పును తప్పుపడుతూ కొట్టవేసింది. ఈ కేసులో తుది తీర్పు జారీ ప్రక్రియను ట్రయల్‌ కోర్టు ఆలస్యం చేయడాన్ని సుప్రీం తప్పుపట్టింది

”ఒక జంట భార్యాభర్తలుగా దీర్ఘకాలంపాటు కలిసి ఉంటే వారిని వివాహం చేసుకున్నట్లుగానే భావించాలి. సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్‌ 114 ఇదే సూచించింది. అలాగే ఇలాంటి సహజీవనంలో కలిగే సంతానానికి పూర్వీకుల ఆస్తిలో వాటా కూడా లభిస్తుంది. దీనిని అక్రమ సంతానంగా భావించకూడదు” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును ఎవరైనా సవాల్‌ చేయవచ్చని కోర్టు పేర్కొంది. అయితే వారు పెళ్లి చేసుకోలేదని రుజువు చేయాల్సిన బాధ్యత సవాలు చేసినవారిమీదే ఉందని సుప్రీం పేర్కొంది.

సుప్రీం తీర్పు చెప్పిన కేసు వివరాలు..

ఆస్తి యజమాని కట్టుకండి ఎడతిల్‌ కనరన్‌ వైద్యర్‌కు దామోదరన్‌, అచ్యుతన్‌, శేఖరన్‌, నారాయణన్‌ అనే నలుగురు కుమారులు ఉన్నారు. వీరిలో శేఖరన్‌, నారాయణన్‌ కుమారులు లేకుండా మరణించారు. దామోదరన్‌, అచ్యుతన్‌లకు ఒక్కొక్క కుమారులు ఉన్నారు. దామోదరన్‌, అచ్యుతన్‌ల ఇద్దరు కుమారులు వాదులు. కేసు ప్రకారం, అచ్యుతన్‌ కుమారుడు దామోదరన్‌, అతని జీవిత భాగస్వామి చిరుతకుట్టి వివాహం చేసుకోలేదు. కాబట్టి, దామోదరన్‌ కుమారుడు వివాహేతర సంబంధంతో జన్మించాడు. చట్టబద్ధమైన కుమారుడు కాదు కాబట్టి ఆస్తిలో వాటా పొందకూడదని వాదించాడు. ఈ కేసును మొదట ట్రయల్‌ కోర్టుకు తీసుకెళ్లారు. అది దామోదరన్‌ కుమారుడికి అనుకూలంగా నిర్ణయం తీసుకోగా, హైకోర్టు అచ్యుతన్‌ కుమారుడికి అనుకూలంగా నిర్ణయం ఇచ్చింది. దామోదరన్‌, చురుతకుట్టి చాలాకాలంగా సహజీవనం చేస్తున్నందున వివాహం చేసుకున్నట్లు పరిగణించబడుతుందని కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది.

- Advertisement -

”పార్టీల మధ్య వివాదం తలెత్తడానికి చాలాకాలం ముందు ఫిర్యాదిదారులు సమర్పించిన పత్రాలు ఉనికిలో ఉన్నాయి. ఈ పత్రాలు సాక్ష్యంతో జతచేయబడి, దామోదరన్‌, చిరుతకుట్టి భార్యాభర్తలుగా దీర్ఘకాలం సహజీవనం చేసినట్లు చూపుతుంది. నిందితుల సాక్ష్యాలను కూడా పరిశీలించాం. దామోదరన్‌ చిరుతకుట్టి వారి సుదీర్ఘ సహజీవనం కారణంగా వారి మధ్య వివాహానికి అనుకూలంగా ఉన్న ఊహను ప్రతివాదులు తిప్పికొట్టడంలో విఫలమయ్యారని మేము భావిస్తున్నాము” అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక స్త్రీ, పురుషుడు ఎక్కువ కాలం సహజీవనం చేస్తుంటే, వారు వివాహం చేసుకున్నట్లు భావించబడుతుందని సుప్రీంకోర్టు గతంలో చాలా సందర్భాలలో చేప్పడం జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement