Thursday, March 28, 2024

హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్

హైదరాబాద్‌ లో గణేష్ నిమజ్జనానికి అడ్డంకులు తొలగిపోయాయి. గమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. హుస్సేన్‌సాగర్ సహా అన్ని చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జీహెచ్ఎంసీ సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. జీహెచ్‌ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో హైకోర్టు ఆర్డర్ వచ్చిందని సోలిసిటర్ జనరల్ అన్నారు. విగ్రహాలు చాలా వరకు ఎత్తుగా ఉన్నాయని, అకస్మాత్తుగా ఉత్తర్వులను అమలు చేయడంతో అనేక ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు.  వచ్చే ఏడాది ఈ ఆర్డర్‌ను అమలు చేస్తామని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్‌లు ఏర్పాటు చేశామని కాలుష్యం జరగకుండా వెంట వెంటనే విగ్రహాలను తరలిస్తామని సోలిసిటర్ జనరల్ వివరించారు. నిమజ్జనంపై హైకోర్టు ఉత్తర్వులు చివరి నిమిషంలో వెలువడినందున ఈ సంవత్సరం అందులో కొన్ని మినహాయింపులు కోరుతున్నట్లు జీహెచ్ఎంసీ తరుపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. హైకోర్టు ఉత్తర్వుల్లోని చాలా అంశాలకు తాము కట్టుబడి ఉంటామని, ఒకటి, రెండు అంశాలను మాత్రం తక్షణం అమలు చేయలేమని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. హుస్సేన్‌సాగర్‌‌లో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసుకోవచ్చని ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలు ఒక్క ఏడాదికి మాత్రమేనని, వచ్చే ఏడాది నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీల్లేదని పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్ కాలుష్యకారకంగా మారిపోయిందని, జల వనరులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

కాగా, సుప్రీంకోర్టు తీర్పుతో హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఉన్న  అడ్డంకులు తొలగిపోయాయి. హుస్సేన్‌సాగర్ సహా అన్ని చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం జరగనున్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్

Advertisement

తాజా వార్తలు

Advertisement