Monday, April 15, 2024

మణిపూర్​ నుంచి విద్యార్థులను తీసుకురావాలి.. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలి: జీవీఎల్

మణిపూర్‌లోని హింసాత్మక ప్రాంతం నుంచి ఆంధ్ర విద్యార్థులను తరలించాలని ఏపీ సీఎం జగన్​మోహన్​రెడ్డికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖరాశారు. మణిపూర్ అధికారులతో మాట్లాడి విద్యార్థులు సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి స్థానికంగా అన్ని సహాయాలు అందించాలని ఎంపీ జీవీఎల్ కోరారు.

– న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ‌

మణిపూర్ లో మూడు జాతీయ విద్యాసంస్థలయిన ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ (NIT), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT), సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చదువుతున్న సుమారు 150 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

- Advertisement -

మణిపూర్‌లో పరిస్థితి తీవ్రంగా ఉన్నందున, తల్లిదండ్రులు, విద్యార్థుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని జీవీఎల్ తన లేఖలో పేర్కొన్నారు. మణిపూర్‌లో పరిస్థితి పూర్తిగా సాధారణమయ్యే వరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది తల్లిదండ్రులు, విద్యార్థులతో ఫోన్‌లో తాను మాట్లాడిన సంభాషణలను ఉటంకిస్తూ, విద్యార్థులు ఏపీకి తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నారని జీవీఎల్ పేర్కొన్నారు.

తాను కూడా మణిపూర్ ప్రభుత్వ సీనియర్ అధికారులతో మాట్లాడానని, వాణిజ్య విమానాలు లేదా ప్రత్యేక చార్టర్డ్ విమానాల్లో తిరిగి వచ్చే విద్యార్థులందరినీ సురక్షితంగా తరలించడంలో సహాయం చేస్తామని వారు హామీ ఇచ్చారని జీవీఎల్ పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల్లో పరిమిత సీట్లు అందుబాటులో ఉండటం, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో విద్యార్థులకు టిక్కెట్లు దొరకడం కష్టంగా ఉందని, ఏపీ విద్యార్థులను స్వ రాష్ట్రానికి చేర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జీవీఎల్ కోరారు. ఇంఫాల్ నుండి విశాఖపట్నం/విజయవాడ లేదా తిరుపతికి ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అనేక రాష్ట్రాలు తమ విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి ఇప్పటికే ఇటువంటి ఏర్పాట్లు చేశాయని పేర్కొంటూ, అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని జీవీఎల్​ తన లేఖలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement