Thursday, April 18, 2024

Story : అత్యంత ద‌య‌నీయ‌స్థితిలో ఆప్ఘాన్ వాసులు – ఆక‌లి బాధ‌తో అవ‌య‌వాల అమ్మ‌కం

ఆప్ఘ‌నిస్థాన్ ..తాలిబ‌న్ల చేతిలోకి వెళ్ళాక అక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్ష న‌ర‌కం అంటే ఏంటో ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒక‌ప‌క్క‌, తాలిబ‌న్ల ఆంక్ష‌లు మ‌రోప‌క్క‌, ప్ర‌కృతి విల‌యాలు ఇంకోప‌క్క‌..ఇలా అన్ని విధాలుగా నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు ఆప్ఘ‌న్ ప్ర‌జ‌లు. రీసెంట్ గా ఆప్ఘ‌నిస్థాన్ లో భారీ భూకంపం చోటు చేసుకోగా 250మంది మ‌ర‌ణించార‌ని ..ఇంకా శిథిలాల కింద ప‌లువురు ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న అప్ఘనిస్తాన్ పై ఇప్పుడు ప్రకృతి చూపిన కోపంతో విలవిలలాడుతున్నారు.ఆప్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్న అనంత‌రం .. ప్రపంచ దేశాలు సహాయాన్ని నిలిపివేశాయి. దీంతో దేశంలో ఆహార కొరత తీవ్ర మైంది. దేశంలో ప్రస్తుతం 2 కోట్ల.. 28 లక్షల మందికి ఆహార కొరత ఉన్నట్లు కొన్ని సంస్థలు నివేదికను బయటపెట్టాయి. ఇందులో 87 లక్షల మంది ఆకలి చావులకు చేరువయ్యారని తెలిపింది. ఇక దేశంలో 30 శాతం మంది ఒక్కపూట కూడా భోజనం చేయలేని పరిస్థితి దాపురించిందట.

మరోవైపు అనారోగ్యం ..ప‌లు వ్యాధులు జనాల ప్రాణాలను తీస్తున్నాయి. ఈ సమయంలో భూకంపంతో దేశ పరిస్థితిని మరింత ఆందోళనకు నెట్టింది. కరువుతో కొట్టుమిట్టాడుతున్న అప్ఘనిస్తాన్ ను ఆదుకోవాలని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే పలు దేశాలను కోరింది. అయితే తాలిబన్ల పాలనతో భయపడుతున్న చాలా దేశాలు ముందుకు రావడం లేదు. కొన్ని దేశాలు ముందుకు వచ్చినా తాలిబన్లు వారికి కఠిన ఆంక్షలు పెడుతున్నాయి. వీట‌న్నింటి న‌డుమ దేశ ప్రజలు నలిగిపోతున్నారు. తాలిబన్లు తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలతో వ్యవసాయం ఇతర పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. పెరిగిన నిత్యావసర ధరలతో కడుపు నిండలేని పరిస్థితి ఏర్పడింది.ఆకలి బాధలు తట్టుకోలేక కొంతమంది తమ అవయవాలను అమ్ముకుంటున్న ఘటనలు ఉన్నాయంటే దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.

భూకంపం రాకముందు అంతో ఇంతో ఆరోగ్య వసతులు ఉండేవి. కానీ ఇప్పుడు అవన్ని తుడిచిపెట్టుకుపోయాయి. ఎటు చూస్తున్న అంబులెన్స్ హారన్లు తప్ప వైద్యులు కనిపించడం లేదు. బాధితులకు సాయం చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నా కమ్యూనికేషన్.. నీటి సదుపాయలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.ప్రపంచబ్యాంకు సైతం అప్పులు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితుల్లో బతకడమే గగనంగా మారింది. పెద్ద మనసు చేసుకొని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరుతున్నారు. కాగా భార‌త్ ముంద‌డుగు వేసి ఆప్ఘ‌న్ కి సాయమందించింది. మ‌రి మిగ‌తా దేశాలు కూడా ఆదుకుంటే కానీ అక్క‌డి ప‌రిస్థితులు ..ప్ర‌జ‌ల ఆక‌లి తీరేలా క‌నిపించ‌డం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement