Thursday, April 25, 2024

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు, సెన్సెక్స్‌ 537 పాయింట్లు డౌన్‌.. అంతర్జాతీయంగా ప్రతికూలత

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి పూర్తిగా నష్టాల్లోనే కదలాడాయి. ఆర్థిక వృద్ధి భయాలు, తూర్పు యూరప్‌కు రష్యా గ్యాస్‌ సరఫరాను తగ్గించనుందనే వార్తలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఉదయం సెన్సెక్స్‌ 56,983.68 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,079.03 పాnయింట్ల గరిష్టానికి, 56,584.04 పాయింట్ల కనిష్టాన్ని తాకాయి. చివరికి 537 పాయింట్ల నష్టంతో 56,819.39 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,073.35 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 17,110 పాయింట్ల గరిష్టాన్ని, 16,958 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 162.40 పాయింట్లు నష్టపోయి 17,038 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.54 వద్ద ట్రేడ్‌ అవుతున్నది.


చైనాలో కరోనా ఆందోళనలు
సెన్సెక్స్‌ 30 సూచీలో 6 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌షేర్లు లాభపడ్డ వాటిలో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, సన్‌ ఫార్మా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేశాయి. మిశ్రమ కార్పొరేట్‌ ఫలితాలు, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు, ఐరోపా దేశాలకు రష్యా గ్యాస్‌ సరఫరాను నిలిపివేసే అవకాశం ఉందన్న ఊహాగానాల వంటి పరిణామాలు సూచీలకు ప్రతికూలంగా మారాయి. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement