Wednesday, April 24, 2024

నాకు అండగా ఉండండి.. అబద్దాల బ్యాచ్ ను నమ్మకండి.. జగన్

అబద్దాల బ్యాచ్ ను నమ్మొద్దని.. మీ బిడ్డకు అండగా ఉండండని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం సాయం విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి తేడా గమనించండని అన్నారు. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారన్నారు. సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు ఎగ్గొట్టారన్నారు. చంద్రబాబుది అబద్దాలు చెప్పే బ్యాచ్ అని.. ఆ బ్యాచ్ ను నమ్మొద్దని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం ప‌థ‌కం కింద రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామ‌న్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోందన్నారు.

వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ.15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ.45,000 ఆర్థిక సాయంచేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. నేడు అందిస్తున్న రూ.658.60 కోట్లతో కలిపి వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు వైయ‌స్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.1,257.04 కోట్లు అన్నారు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు రూ.30 వేల సాయం అందించామన్నారు. అదేవిధంగా వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అందించిన లబ్ధి రూ.2,25,991.94 కోట్లు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement