Tuesday, April 23, 2024

ప్రమాదాన్ని ముందే గుర్తించిన శ్రీలంక పైలట్లు.. 525 మంది ప్రయాణికులు సేఫ్

శ్రీలంక పైలట్లు 525 మందిని రక్షించారు. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్లపై సర్వత్ర హర్షం కురుస్తోంది. గగనతలంలో రెండు విమానాలు ఢీకొట్టుకునే పెను తప్పించి ఎంతో ప్రాణాలను కాపాడారు. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఎల్-504 విమానం ఈ నెల 13న లండన్ నుంచి 275 మంది ప్రయాణికులతో కొలంబో బయలుదేరింది. విమానం టర్కీ గగనతలం పైనుంచి 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానాన్ని 35 వేల అడుగులకు తీసుకెళ్లాలని అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పైలట్లకు ఆదేశాలు అందాయి. అదే ఎత్తులో మరో విమానం వస్తోందని, కేవలం 15 మైళ్ల దూరంలోనే ఉందని శ్రీలంక పైలట్లు గుర్తించారు. వెంటనే వారు ఆ విషయాన్ని ఏటీసీ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ పట్టించుకోని ఏటీసీ పైకి వెళ్లేందుకు రెండుసార్లు క్లియరెన్స్ ఇచ్చింది.

ప్రమాదాన్ని ఊహించిన శ్రీలంక పైలట్లు 35 వేల అడుగుల ఎత్తుకు వెళ్లేందుకు నిరాకరించారు. ఆ తర్వాత తమ పొరపాటును గుర్తించిన ఏటీసీ పైకి వెళ్లవద్దని, అదే ఎత్తులో దుబాయ్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం 250 మందితో వస్తోందని శ్రీలంక పైలట్లకు సమాచారం ఇచ్చింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఏటీసీ తొలుత ఇచ్చిన ఆదేశాలను పైలట్లు గుడ్డిగా పాటించి ఉంటే 525 మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయి ఉండేవంటూ శ్రీలంక ఎయిర్‌లైన్స్ నిన్న వెల్లడించింది. పైలట్లు సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందంటూ ప్రశంసించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement