Wednesday, April 24, 2024

Big Story: రీ సర్వేలో స్పీడ్‌.. వచ్చే డిసెంబర్‌తో ప్రక్రియ పూర్తి

అమరావతి, ఆంధ్రప్రభ: దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేలో భాగంగా రెండువేల గ్రామాల రైతులకు జగనన్న భూ హక్కు పత్రాల పంపిణీతో పాటు 15 రోజుల్లో ఆయా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేష్రన్‌ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో హక్కు పత్రాలను భూ యజమానులకు అందించే ప్రక్రియను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. గ్రామాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. అంతేకాదు రికార్డుల స్వచ్ఛీకరణతో భూ సమాచారాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడినుంచైనా పొందే వీలు కలగనుంది. రాష్ట్రంలోని మొత్తం 17,461 గ్రామాల్లో 1.07 కోట్ల మంది రైతులకు చెందిన 2.47 కోట్ల సర్వే నంబర్లలోని 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములతో రీసర్వే ప్రాజెక్టును చేపడుతున్నారు.

- Advertisement -

ఇప్పటివరకు 47,276 చ.కి.మీ పరిధిలోని 6,819 గ్రామాల్లో డ్రోన్‌ ప్లnయింగ్‌ పూర్తయింది. నేటికి 2000 గ్రామాల్లో రీసర్వే కార్యకలాపాలు పూర్తి కాగా 1835 గ్రామాల్లో 7,29,381 మంది రైతులకు భూ హక్కు పత్రాలు రూపొందించారు. నూరేళ్ల తరువాత రీ సర్వేను మహా యజ్ఞంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దశలవారీగా రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తిచేసి ఆయా గ్రామ సచివాలయాల్లో స్ధిరాస్తుల రిజిస్ట్రేష్రన్ల ప్రక్రియ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. 2020 డిసెంబర్‌ 21న ”వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకాన్ని” ప్రారంభమైంది. రెండు వేల గ్రామాల్లో రీసర్వే సమయంలో, రైతులు దరఖాస్తు చేసుకోకుండా 8 నుంచి 9 నెలల వ్యవధిలో 4.3 లక్షల సబ్‌డివిజన్‌లు మరియు 2 లక్షల మ్యుటేషన్‌లు భూమి మరియు రెవెన్యూ రికార్డులలో జరిగాయి.

భూ రికార్డుల ప్రక్షాళణ…భూ కమతం ఒక సర్వే నెంబర్‌ కింద ఉండి, కాలక్రమేణా విభజన జరిగి చేతులు మారినా కూడా సర్వే రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడంతో రగులుకుంటున్న భూ వివాదాలు, రిజిస్ట్రేష్రన్‌ ప్రక్రియలో ఇబ్బందులకు ఇకపై స్వస్తిచెప్పి భూ రికార్డులను ప్రక్షాళన చేసి, ప్రతి భూ కమతానికి (సబ్‌ డివిజన్‌కు కూడా) విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించనున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. డ్రోన్లు, కంటిన్యూయస్లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్లు (కార్స్‌, జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్స్‌ వంటి అత్యాధునిక సర్వే సాంకేతికతలను ఉపయోగించి ఈ సమగ్ర రీసర్వేని దేశంలోనే ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలనేదే ప్రభుత్వ సంకల్పం. భూ హక్కు పత్రం అందించడం ద్వారా భూ యజమానులకు హక్కు భద్రత కల్పించడం మరియు ఐదు సెంమీ లేదా అంతకంటే తక్కువ కచ్చితత్వంతో జియో-రిఫరెన్స్‌ కోఆర్డినేట్‌ల ఆధారంగా భూ రక్ష సర్వే రాళ్లను నాటడం ద్వారా భూమికి భౌతిక భద్రత కల్పించడం ఈ సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాలు.

ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన భూ కమత పటం భూ యజమానులకు జారీ చేస్తారు. గ్రామ స్ధాయిలో భూ రికార్డులన్నీ క్రోడీకరించి, మ్యాపులు ( భూ కమతాలతో కూడిన గ్రామ పటం) ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటు-లోకి వస్తాయి. సింగిల్‌ విండో పద్దతిలో ప్రతి ఆస్తికీ ప్రభుత్వ హమీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం జారీ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్ళు ఏర్పాటవుతాయి. డూప్లికేట్‌ రిజిస్ట్రేష్రన్లకు ఇకపై తావుండదు. దళారీ వ్యవస్ధ, లంచాలకు అడ్డుకట్ట వేయాలనేది ప్రభుత్వ భావన. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్‌ పెట్ట నున్నారు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులకు వీల్లేకుండా భూ లావాదేవీల ఆధారంగానే రికార్డుల్లో మార్పులు జరిగేలా, అవసరమైన చోట సబ్‌ డివిజన్‌ మార్పులు చేసిన తర్వాతే రిజిస్ట్రేష్రన్ల ప్రక్రియ నిర్వహించడం ద్వారా శాశ్వత హక్కు కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సర్వే ప్రతి అడుగులో భూ యజమానుల భాగస్వామ్యంతో పాటు మండల మొబైల్‌ మెజిస్ట్రేట్ర్‌ బృందాల ద్వారా అభ్యంతరాల పరిష్కరించనున్నారు. రాష్ట్రంలోని 13,371 గ్రామకంఠంలో (గ్రామ నివాస స్థలం) 85 లక్షల ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ ఆస్తులను మరియు 123 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ ఆస్తులను సర్వే చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఈ గ్రామ స్థలాలు మరియు మున్సిపల్‌ భూములు కూడా మొదటిసారిగా సర్వే నిర్వహిస్తున్నారు. భూముల రీ సర్వే రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో ప్రారంభించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలిసారిగా భూ రక్ష సర్వే రాళ్ల ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంంది.

దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయంలో ఇంటిగ్రే-టె-డ్‌ సర్వే, రిజిస్ట్రేష్రన్‌, మ్యుటేషన్‌ సేవలను అందించే అన్ని భూములకు సంబంధించిన సేవలు ఏకీకృతం చేయటం ద్వారా సింగిల్‌ డెస్క్‌ సిస్టమ్‌ (గ్రామ సచివాలయం) పరిధిలోకి తెస్తారు. సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయత్‌ రాజ్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేష్రన్‌ మరియు రిజిస్ట్రేష్రన్‌ శాఖల సమన్వయంతో రీ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే, సెటిల్‌మెంట్‌ విభాగం గ్రామ స్థాయిలో 10,185 మంది గ్రామ సర్వేయర్‌లను నియమించింది, వీరికి అధునాతన రీసర్వే సాంకేతికతలపై 70కి పైగా శిక్షణలు ఇస్తున్నారు. అదనంగా, 1358 మండలాలకు మొబైల్‌ మేజిస్ట్రేట్ర్‌ వాహనాలు (మండలానికి రెండు) మంజూరు చేశారు. రైతుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు 2797 మంది గ్రామ రెవెన్యూ అధికారులు, 7033 మంది పంచాయతీ కార్యదర్శులు, 3664 మంది వార్డు ప్రణాళిక కార్యదర్శులను నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement