Wednesday, April 24, 2024

Special Story : మోదీ విధానాలతో పటిష్టమవుతున్న ఆర్థిక వ్యవస్థ.. సవాళ్లు ఎదురైనా వేగం తగ్గలేదు..!

గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి : కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలీయంగా రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వివిధ దేశాల ర్యాంకులు సూచించే సూచీలో భారత్ ర్యాంకు గణనీయంగా మెరుగుపడటమే అందుకు నిదర్శనం. ఇప్పటివరకు 43వ స్థానంలో వున్న భారత్ ఏకంగా ఆరు స్థానాలు పైకెగబాకి 37వ స్థానంలో నిలిచింది.

ప్రపంచంలోని 63 దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రామాణికంగా తీసుకొని ఈ ర్యాంకులను నిర్ధారిస్తారు. ఆసియా దేశాలలో గత ఏడాది మూడవ స్థానంలో ఉన్న డెన్మార్క్ ఈ సంవత్సరం మొదటి స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు ప్రథ‌మ స్థానంలో ఉన్న స్విట్జర్ల్యాండ్ రెండవ స్థానానికి దిగజారింది. అదేవిధంగా అయిదవ స్థానంలో ఉన్న సింగపూర్ మూడవ స్థానానికి చేరుకుంది. స్వీడన్, హాంగ్ కాంగ్, నెదర్లాండ్స్, తైవాన్, ఫిన్లాండ్, నార్వే, అమెరికాలు మొదటి పది స్థానాలలో ఉన్నాయి.

ప్రపంచ పోటీతత్వ సూచీలో భారత్ ర్యాంకు గణనీయంగా మెరుగుపడటం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుకు దర్పణం పడుతున్నది. ఆసియా ఆర్థిక వ్యవస్థలోనే అత్యంత వేగవంతమైన పనితీరును కనబర్చిన దేశాల సరసన భారత్ నిలిచింది. ఆసియా ఆర్థిక వ్యవస్థలో సింగపూర్ 3వ, హాంగ్ కాంగ్ 5వ, తైవాన్ 7వ, చైనా 17వ స్థానాలతో అంతకు ముందు సంవత్సరం కంటే ర్యాంకులను మెరుగుపరచుకున్నాయి.

ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వ్యాపార రంగంలో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు దోహదపడ్డాయని ఐఎండీ తన నివేదికలో వెల్లడించింది. వాణిజ్య అంతరాయాలు, ఇంధన భద్రత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, కోవిడ్ మహమ్మారి తర్వాత జీడీపీ వృద్ధి రేటు కొనసాగించటం వంటి సవాళ్ళు ఉన్నప్పటికి వాటన్నింటిని అధిగమించి భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగైన ర్యాంకు సాధించటం విశేషం. ఆర్థిక వ్యవస్థ పనితీరులోని ప్రతిఫలాలు అందుకు ఎంతగానో దోహదపడినట్టు నివేదికలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement