Friday, April 19, 2024

యూపీలో ఎస్పీ, ఆర్ ఎల్ డీ పొత్తు ఖరారు.. ప్రకటించిన నేతలు

లక్నో: వచ్చే శాసనసభ ఎన్నికల్లో కలసి పోటీ చేసేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్లో గట్టి పట్టున్న ప్రాంతీయ పార్టీ రాష్ర్టీయ లోక్ దళ్ మధ్య పొత్తు కుదిరింది. లక్నోలోని ఆర్ ఎల్ డీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత జయంత్ చౌదరితో మంగళవారం సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. అనంతరం ట్విట్టర్ లో పొత్త విషయాన్ని వెల్లడించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో జయంత్ చౌదరితో కలసి పాల్గొంటామంటూ ఇద్దరూ కరచాలనం చేసుకుంటున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అదే వ్యాఖ్యలు, ఫోటోలతో జయంత్ చౌధరి ఖూడా ట్విటర్ లో పోస్ట్ చేశారు. సూత్రప్రాయంగా పొత్త ఖరారుకాగా ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా పార్టీ రాష్ర్టశాఖల అధ్యక్షులు బహిరంగ ప్రకటన చేయనున్నారు.

పొత్తులో భాగంగా తమకు 45 సీట్లు కావాలని ఆర్ ఎల్ డీ పట్టుబడుతూండగా సమాజ్ వాదీ పార్టీ 25 సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడించింది. అయితే అఖిలేష్, జయంత్ చౌధరి మధ్య తాజాగా చర్చలు జరిగిన నేపథ్యంలో 35-40 సీట్ల మద్య కేటాయించేందుకు ఒప్పందం కుదిరినట్లు రాష్ర్టీయ లోక్ దళ పార్టీ సీనియర్ నేత ఒకరు మంగళవారం చెప్పారు. అలాగే, పశ్చిమ యూపీలో ఆర్ ఎల్ డీకి గట్టి ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ గుర్తుపై ఎస్ పీ కి చెందిన కొందరు నేతలు పోటీలో నిలబెట్టాలని కూడా ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లోను, 2017 శాసనసభ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావ చూపలేకపోయినప్పటికీ ఆర్ ఎల్ డీని తీసిపారేయడానికి లేదు. రైతుల్లో గట్టి పట్టున్న ఈ పార్టీ ఇటీవలి కాలంలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమించిన నేపథ్యంలో తమకు
అనుకూలంగా ఓటరు తీర్పు ఉంటుందని ఆశలు పెట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement