Thursday, April 25, 2024

ప్రతిపక్ష నేతలతో సోనియా గాంధీ వీడియో కాన్ఫరెన్స్

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష పార్టీల అధినేతలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 19 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, శివసేన, జేఎంఎం, సీపీఐ, సీసీఎం, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆర్జేడీ, ఏఐయూడీఎఫ్‌, విడుదలై చిరుతైగల్ కట్చి, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్, జేడీ(ఎస్‌), ఆర్‌ఎల్డీ, ఆర్‌ఎస్పీ, కేరళ కాంగ్రెస్ (ఎం), ఐయూఎంఎల్‌ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఆన్‌లైన్‌ సమావేశంలో భాగమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్‌ గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యతను ఏకీకృతం చేయడం, దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై వివిధ ప్రతిపక్ష పార్టీలను ఒక తాటిపైకి తీసుకురావడం, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించేందుకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం వంటి లక్ష్యాలతో సోనియా గాంధీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, టీఎంసీ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, జేఎంఎం అధినేత, జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్, శివసేన చీఫ్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌కు చెందిన శరద్ యాదవ్, సీపీఐ (ఎం) నేత సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యారు. అయితే సమాజ్‌ వాదీ (ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ లేదా ఆ పార్టీ తరఫున ఎవరూ కూడా ఈ ఆన్‌లైన్‌ సమావేశంలో పాల్గొనలేదు.

ఈ వార్త కూడా చదవండి: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 12 మంది కూలీలు దుర్మరణం

Advertisement

తాజా వార్తలు

Advertisement