Tuesday, April 16, 2024

సప్తవాహనాలపై సిరులతల్లి అభయం

తిరుపతి : సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై అమ్మవారు దర్శనమివ్వడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలను తలపించాయి. ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మ‌వారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గజ వాహనంపై అమ్మవారు దర్శనమివ్వనున్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, ఆధ్వర్యంలో భజన బృందాలు పాల్గొన్నాయి. కోలాటాలు, చెక్కభజనలు, చిడతల భజన తదితర ప్రదర్శనలిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement