Thursday, April 25, 2024

శ్రద్ధ వాకర్‌ ఎముకలను మిక్సీలో వేసి పొడి చేశాడు.. ఆఫ్తాబ్‌ పూనావాలా మరో ఘాతుకం

తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్‌ను ముక్కలుగా నరికి అత్యంతపాశవికంగా హత్య చేసిన ఆఫ్తాబ్‌ పూనావాలా గురించి మరో సంచలన విషయం బయటపడింది. శ్రద్ధాను ముక్కలు చేసి ఎముకలను మిక్సీ గ్రైండర్‌లో వేసి పొడి చేశాడని విచారణలో వెల్లడైంది. ఎముకలను గ్రైండర్‌లో పొడి చేసి, అనంతరం వాటిని పారవేసినట్టు తెలిసింది. హత్య చేసిన మూడు నెలల తర్వాత శ్రద్ధ తలను పారేశాడని పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన 6,600 పేజీల చార్జిషీట్‌లో వెల్లడైన భయంకర వివరాలివి. గత ఏడాది మే 18న శ్రద్ధను చంపిన తర్వాత పూనావాలా ఆన్‌లైన్‌లో చికెన్‌ రోల్‌ ఆర్డర్‌ చేసి, తెప్పించుకుని మరీ తిన్నాడు. ఆఫ్తాబ్‌కు ఢిల్లి నుంచి దుబాయ్‌ వరకు అనేక మంది యువతులతో సంబంధాలున్నాయని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

మే 18న శ్రద్ధా వాకర్‌, ఆఫ్తాబ్‌ ఇరువురూ ముంబాయి వెళ్లాలని ప్లాన్‌ వేసుకున్నారు. అయితే చివరి క్షణంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. టికెట్‌ రద్దు విషయంపై గొడవ జరిగిందని, క్షణికావేశంలో ఆఫ్తాబ్‌, శ్రద్ధ వాకర్‌ గొంతును కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ప్లాస్టిక్‌ సంచిలో ప్యాక్‌ చేసి పారేయాలని తొలుత భావించినట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అందుకు అతడు ఓ బ్యాగ్‌ కూడా కొన్నాడు. ఆనవాళ్లు మిగలకుండా ఉండేందుకు ముక్కలుగా నరికివేయడం ఉత్తమమని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఒక రంపం, ఒక సుత్తి, మూడు కత్తులు కొన్నాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని 35 ముక్కులుగా నరికాడు. గత ఏడాది చివర్లో జరిగిన పాలిగ్రాఫ్‌, నార్కో అనాలిసిస్‌ పరిక్షలో ఆఫ్తాబ్‌ పూనావాలా హత్య చేసినట్టు అంగీకరించాడని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement