Friday, April 26, 2024

కేరళలో షిగెల్లా ? కోజికోడ్‌లో తొలి కేసు నమోదు..

తిరువనంతపురం: కేరళలో మరోసారి షిగెల్లా కలవరం మొదలైంది. కోజికోడ్‌ పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, మలంలో రక్తాన్ని గుర్తించిన తర్వాత పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. బాలిక పొరుగింట్లో ఉన్న మరో చిన్నారిలోనూ ఈ వ్యాధి లక్షణాలున్నాయని, పిల్లలిద్దరికీ పెద్దగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. షిగెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని, ఇది ఒకరినుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. లక్షణాలు తీవ్రమైతే మరణం సంభవిస్తుందని, అందుకే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. షిగెల్లా కేసు నమోదవడంతో అధికారులు స్పందించారు.

నివారణ కోసం పరిసర ప్రాంతంలోని బావుల్లో క్లోరినేషన్‌ చేపట్టారు. జ్వరం, డయేరియా లక్షణాలున్న వారిపై వైద్యారోగ్యశాఖ సర్వే నిర్వహించింది. ఇదివరకు 2020లో కోజికోడ్‌లో షిగెల్లా కేసు నమోదైంది. ఆ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలతో బాధపడుతూ ఓ ఏడాదిన్నర బాలుడు బాలుడు ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. షిగెల్లా బ్యాక్టీరియా షిగెలోసిస్‌ అనే పేగు వ్యాధికి కారణమవుతుదని, అతిసారంతో పాటు, కడుపు నొప్పి, తిమ్మిరి, జ్వరం,వికారం, వాంతులు షిగెల్లా సాధారణ లక్షణాలని, కలుషితమైన ఆహారం తినడం వల్ల బ్యాక్టీరియా సోకడంతో వ్యాధి వస్తుందని వైద్యాధికారులు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement