Thursday, April 25, 2024

తిరుపతిలో ఫోరెన్సిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి.. అమిత్ షాకు ఏపీ సీఎం జగన్ వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యు) ఏర్పాటు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ మేరకు గురువారం ఉదయం గం. 10.30  సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేశారు. నిజానికి బుధవారం రాత్రే అమిత్ షా ను కలవాల్సినప్పటికీ, ఆలస్యం కావడంతో ఆయన సమావేశం గురువారం ఉదయానికి వాయిదా పడింది. సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో కేంద్ర హోంశాఖతో ముడిపడ్డ అనేకాంశాల గురించి చర్చించారు. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర అటవీ-పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసిన సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రాలు అందజేశారు.

గురువారం హోంమంత్రిని కలిసిన జగన్ ప్రపంచ స్ధాయి విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌ రాష్ట్రంలోని గాంధీనగర్‌ కేంద్రంగా నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీ, గోవా, త్రిపురలలో క్యాంపస్‌లను నెలకొల్పిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఫోరెన్సిక్‌ సైన్స్, క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్‌ సైన్స్‌ మరియు క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు నిర్వహిస్తూ ఫోరెన్సిక్‌ నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉన్న కొరతను తీర్చడం కోసం దక్షిణ భారత దేశంలోనూ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటూ, విద్యారంగంలోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలంచాలని అమిత్‌షాకు విన్నవించారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రికి తెలిపారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని సీఎం జగన్ హోం మంత్రికి వివరించారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, రెండు రాష్ట్రాల మధ్య ఇంకా కీలక అంశాలు మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదని హోంమంత్రికి గుర్తుచేశారు. రీసోర్స్ గ్యాప్ ఫండింగ్, 10వ వేతన సంగం బకాయిలు, పెన్షన్లు మొత్తంగా రూ. 32,625.25 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు బిల్లులు రూ.2,937.92  కోట్లు రెండేళ్లుగా చెల్లించలేదని, వాటిని త్వరగా విడుదలయ్యేలా చూడాలని కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగాహోం మంత్రిని కోరారు. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టంలో హేతుబద్ధత లేని నిబంధనల కారణంగా అర్హత ఉన్న 56 లక్షల కుటుంబాలు పీఎంజీకేఏవై కింద లబ్ధి పొందడం లేదని, నెలకు సుమారు 3 లక్షల టన్నులు రేషన్‌ బియ్యం కేంద్రం వద్ద మిగిలిపోతున్నాయని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే అర్హులందరికీ ఆహార భద్రతా చట్టం వర్తింపు చేసినట్టువుతుందని తెలిపారు.

- Advertisement -

రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందుపర్చిన హామీల అమలు గురించి అమిత్ షా తో మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 26కు చేరిందని, కేంద్రం కొత్తగా మంజూరుచేసిన 3 కాలేజీలతో కలుసుకుని ఇప్పటికి 14 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన 12 జిల్లాలకు వెంటనే మెడికల్‌ కాలేజీలు మంజూరుచేయాలని హోంమంత్రిని కోరారు. కడపలో నిర్మించనన్న సీల్‌ప్లాంటుకు సరిపడా ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని కోరారు.

విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌రిజర్వాయర్లకు సంబంధించి పలు అంశాలను అమిత్ షాకు వివరించారు. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు యొక్క అన్ని ఆపరేషనల్‌ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. “ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం 974 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతంతో అపారమైన ఆర్ధిక కార్యకలాపాలకు అనువుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులలో మూడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులను అభివృద్ది చేస్తున్నాం. రామాయపట్నం ఓడరేవుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మార్చి, 2024 నాటికి పోర్ట్‌ కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయి. మిగిలిన రెండు పోర్టుల కోసం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్ట్‌లలో పర్యావరణ అనుమతులు మంజూరుకు మీ సహకారం అందించాలని కోరుతున్నాం” అని కేంద్రమంత్రిని కోరారు. పంప్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అనుకూలమైన స్ధలాలను గుర్తించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందంజలో ఉందని, అదే విధంగా పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల ప్రమోషన్‌ కోసం పాలసీని కూడా రూపొందించిందని, ఆ తరహా ప్రాజెక్టులలో ఎర్రవరం, కురికుట్టి, సోమశిల, అవుకు వంటి చోట్ల ఏర్పాటు జరుగుతోందని, ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిని సీఎం జగన్ కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement