Friday, April 19, 2024

తిరోగమనంలోనే సూచీలు, 365 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌..

ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఇండియన్‌ సూచీలు సోమవారం నాడు కూడా తిరోగమనంలోనే సాగాయి. సెంట్రల్‌ బ్యాంక్‌లు కఠిన విధానాలు అమలు పరచడం, షాంఘై నగర వ్యాప్తంగా కోవిడ్‌ లాక్‌డౌన్‌ విధించడం, రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ పెట్టుబడిదారులను భయాందోళనలకు గురిచేశాయి. దీంతో వరసగా నేడు రెండవ సెషన్‌లో కూడా సూచీలు తిరోగమనంలోనే సాగాయి. విదేశీ నిధులు నిరాంటకంగా తరలిపోవడం, రూపాయి మారకం రేటు ఎన్నడూలేనంతగా పడిపోవడం కూడా మార్కెట్ల పతనానికి కారణాలు. 30 షేర్ల సెన్సెక్స్‌ 365 పాయింట్లు కోల్పోయి 54,471కు చేరుకున్నది. దాదాపు 0.67 మార్కెట్‌ విలువ పడిపోయింది. అదేవిధంగా… ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 109 పాయింట్లు తగ్గి 16,302 పాయింట్ల దగ్గర స్థిర పడింది. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల కూడా పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ 100 దాదాపు 1.78 శాతం, స్మాల్‌ క్యాప్‌ 2.12 శాతం పడిపోయాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ చేంజీలోని 15 రంగాలలో 14 రంగాలు రెడ్‌ స్థాయికి చేరుకున్నాయి.

నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ మెటల్‌, నిఫ్టీ కన్సూమర్‌ డ్యూరబల్స్‌ కూడా వరసగా 1.47 వాతం, 2.03 శాతం, 1.55 శాతం పడిపోయాయి. నిఫ్టీ ఐటీ మాత్రం మంచి లాభాలనే సాధించింది. అత్యధికంగా నష్టపోయిన వాటాలలో రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్సుకు మొదటిస్థానం దక్కింది. ఈ షేర్‌ విలువ 4.30 శాతం పడిపోయి రూ.2,508కి చేరుకున్నది. అదేవిధంగా నెస్ట్‌లీ ఇండియా, హీరో మోటోకార్ప్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ వాటాలు కూడా నష్టపోయాయి. మొత్తం మీద బీఎస్‌ఈలో సోమవారం నాడు 1,049 కంపెనీల షేర్లు లాభాలు గడించగా, 2,416 షేర్లు నష్టాలను చవిచూశాయి. ప్రతిష్టాత్మకమైన ఎల్‌ఐసీ వాటాల విక్రయంలో నేటివరకు 2.88 రెట్ల మేర ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement