భారత్కు తమ వ్యాక్సిన్లను అందించాలంటే ఆర్థిక, చట్ట పరమైన భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలని అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలు ఇప్పటికే భారత్ను కోరాయి. వ్యాక్సిన్ల వల్ల భారత్లో ప్రతికూల ప్రభావాలు తలెత్తితే చట్టపరమైన చిక్కులతో పాటు ఆర్థికంగా నష్ట పరిహారాల అంశాలకు టీకా సంస్థలను బాధ్యులను చేయబోమంటూ సర్కారు భద్రత కల్పించాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఆ భద్రత కల్పించేందుకు తాము సిద్ధమేనంటూ కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. ఫైజర్, మోడెర్నాల సంస్థలు దేశంలో తమ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకుంటే ఆ సంస్థలకు అనుమతి ఇస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే అమెరికాతో పాటు పలు దేశాలు ఆయా సంస్థలకు రక్షణ కల్పిస్తూ హామీ ఇచ్చాయని తెలిపాయి.
ఇప్పుడు దేశీయ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ కూడా అదే డిమాండ్ ను లేవనెత్తింది. తమకు కూడా ఆర్థిక, చట్ట పరమైన భద్రత కల్పించాలని చెప్పింది. అన్ని సంస్థలకూ ఒకే రకమైన నిబంధనలు ఉండాలని సీరం అంటోంది. ఒకవేళ విదేశీ సంస్థలకు ఆర్థిక, చట్టపరమైన భద్రత కల్పిస్తే సీరం సంస్థతో పాటు ఇతర అన్ని వ్యాక్సిన్ సంస్థలకూ ఆ భద్రత కల్పించాలని సీరం వర్గాలు డిమాండ్ చేశాయి. కాగా, దేశంలో టీకాల కొరత నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యాక్సిన్ల సంస్థలకు పలు మినహాయింపులు కల్పించింది.