Wednesday, April 24, 2024

జులైలో తగ్గిన వాహనాల అమ్మకాలు..

దేశీయ వాహనాల రిటైల్‌ అమ్మకాలు జులైలో 8 శాతం తగ్గాయి. ప్రధానంగా ప్రయాణీకుల వాహనాలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు పడిపోవడమే దీనికి కారణమని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. జులై నెలలో దేశవ్యాప్తంగా 14,36,927 వాహనాల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం జులై నెలలో 15,59,106 వాహనాల అమ్మకాలు జరిగాయి. దీంతో పోల్చితే ఈ సంవత్సరం జులై అమ్మకాలు 8 శాతం తగ్గాయి. ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 5 శాతం తగ్గి, 2,50,972 వాహనాల అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో వీటి అమ్మకాలు 2,63,238 వాహనాల అమ్మకాలు జరిగాయి. స్వల్పంగా అమ్మకాలు తగ్గినప్పటికీ, ఎస్‌యూవీ కాంపాక్ట్‌ విభాగంలో కంపెనీలు పలు కొత్త మోడళ్లను మార్కెట్‌లో విడుదల చేశాయని, వీటి వల్ల వచ్చే నెలల్లో అమ్మకాలు జరిగే అవకాశం ఉందిన ఫాడా అధ్యక్షుడు వెంకిష్‌ గులాటీ అభిప్రాయపడ్డారు.

తగ్గిన ద్విచక్ర వాహన అమ్మకాలు..

టూ వీలర్స్‌ అమ్మకాలు ఈ జులైలో 10,09,574 వాహనాల అమ్మకాలు జరగాయి. గత సంవత్సరం జులైలో 11,33,344 వాహనాల అమ్మకాలు జరిగాయి. టూ వీలర్స్‌ అమ్మకాలు ఈ సంవత్సరం 11 శాతం తగ్గాయి. అధిక ద్రవ్యోల్బణం, ప్రతికూల వాతావరణం, ధరలు పెరగడం వల్ల అమ్మకాలపై ప్రభావం చూపిందని వింకేష్‌ అభిప్రాయపడ్డారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ తగ్గడం కూడా ఒక కారణమన్నారు.

28 శాతం తగ్గిన ట్రాక్టర్ల అమ్మకాలు..

ఈ ఏడాది జులైలో ట్రాక్టర్ల అమ్మకాలు 28 శాతం తగ్గాయి. గత సంంత్సరం ఇదే నెలలో 82,419 ట్రాక్టర్ల అమ్మకాలు జరిగితే, ఈ సారి 59,573 యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. త్రిచక్ర వాహనాల విక్రయాలు మాత్రం భారీగా పెరిగాయి. గత సంత్సరం జులైలో 27,908 వాహనాల అమ్మకాలు జరగగా, 80 శాతం పెరిగి 50,197 త్రిచక్ర వాహనాల అమ్మకాలు జరిగాయి. కమర్షియల్‌ వాహనాల అమ్మకాలు కూడా 27 శాతం పెరిగాయి.

- Advertisement -

మరో సారి చిప్‌ సమస్య..

ఉక్రెయిన్‌, రష్యా సమస్యతో ఏర్పడిన సెమికండక్టర్ల సమస్య మెరుగుపడుతున్న సమయంలో మరోసారి ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని ఫాడా ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా చైనా, తైవాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చిప్‌ సమస్య తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఫాడా అధ్యక్షుడు వెంకిష్‌ గులాటీ చెప్పారు. ఇదే జరిగితే వాహన పరిశ్రమ తీవ్ర సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తైవాన్‌లో చిప్‌ సరఫరా, తయారీ సంస్థ టీఎస్‌ఎంసీ ఈ విషయంలో చేతులెత్తేసిందని తెలిపారు. చైనా దాడి చేస్తే సెమికండక్టర్లను సరఫరా చేయలేమని టీఎస్‌ఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల వాహన రంగంతో పాటు , టెక్నాలజీ సంస్థలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement