Thursday, April 25, 2024

ఆదాయంలో ఆర్టీసీ సరికొత్త రికార్డు.. ఒక్కరోజే రూ.23 కోట్ల రాబడి

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ ఆర్టసీ) ఆదాయం ఆర్జనలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నెల 18న ఒక్కరోజే రూ.23 కోట్ల ఆదాయంతో ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం సాధించిన రోజుగా రికార్డు నెలకొలిపింది. సాధారణంగా ప్రతి ఏటా సంక్రాంతి సీజన్లో రికార్డు స్థాయి ఆదాయం నమోదవుతుంది. కానీ ఈ ఏడాది సాధించిన ఈ ఘనతకు ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో మాదిరి టిక్కెట్ల రేట్లు- 50 శాతం అదనంగా పెంచలేదు. ప్రయాణికులు విశేషంగా ఆదరించడంతో సాధారణ ఛార్జీలతోనే సంక్రాంతి ప్రత్యేక బస్సులన్నీ నడిపారు. సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడిపితే ప్రయాణీకులు ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనమని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ సంక్రాంతికి ప్రయాణికులు తమ ప్రయాణ వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారని పేర్కొన్నారు.

ఇతర ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల కంటే ఆర్టీసీకే మొగ్గు చూపాన్నారు. కాగా ఈ సంక్రాంతి సమయంలో కార్గో ద్వారా కూడా సరాసరిన ఒక రోజు ఎక్కువ ఆదాయం నమోదైందని తెలిపారు. ఒక్క రోజులో రూ.55 లక్షలు సాధించినట్లు పేర్కొన్నారు. అంతకు ముందు ఒక రోజు ఆదాయం రూ.45 లక్షలుగా రికార్డులో ఉన్నట్లు తెలుపుతూ ఇప్పుడు దానిని అధిగమించామన్నారు. ప్రయాణికులకు ముందస్తుగా బస్సులను అందుబాటులో ఉంచడం, నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించడం, సమర్ధవంతంగా నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు బస్సులను పర్యవేక్షించడం, ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయడం వల్లనే ఆర్టీసీ రికార్డు స్థాయి ఆదాయం సాధించగలినట్లు తిరుమలరావు తెలిపారు.

సంస్థలోని సిబ్బంది ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల అంకితభావం, వారి కృషి ఫలితంగానే ఈ సంక్రాంతి ప్రత్యేక సమయంలో ఈ ఘనత ఆర్టీసీ సాధించిందన్నారు. అంతేకాకుండా పర్యవేక్షణలో అధికారుల సహాయసహకారాలు కూడా కొనియాడదగినవని, కార్గో పట్ల, ప్రత్యేక సర్వీసుల పట్ల ప్రయాణికులు చూపించిన ఆదరణ ఏ.పి.ఎస్‌.ఆర్‌.టి.సి. ఎప్పటికీ మరువలేనిదని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే ఆదరణ ఆర్టీసీ పట్ల చూపిస్తారని పూర్తిగా విశ్వసిస్తూ, మరొక్కసారి ఆదరించిన ప్రయాణికులందరికీ ఆర్టీసీ తరుపున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement