Monday, April 15, 2024

Telangana | ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు.. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటేనే చాన్స్​

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్‌ చేసుకుంటే టికెట్‌లో 5 శాతం రాయితీ కల్పించింది. 46రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టంను అప్‌డేట్‌ చేసింది. ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న అన్ని సర్వీస్‌లకు ఈ రాయితీ వర్తిస్తుందని టీఎస్‌ ఆర్టీసీ స్పష్టం చేసింది. సంక్రాంతి సందర్భంగా ముందస్తు రిజర్వేషన్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు సంస్థ పెంచింది. ఈ ఏడాది జూన్‌ వరకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

ఈ సదుపాయానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్‌లైన్‌లో సులువుగా తమ టికెట్లను రిజర్వేషన్‌ చేసుకున్నారు. ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ ప్రత్యేక రాయితీలను ఆర్టీసీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండి సజ్జన్నార్‌ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగలు ఎక్కువగా ఉన్నాయి, ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, టీఎస్‌ ఆర్టీసీ అందిస్తున్న రాయితీ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సాధ్యమనీ, ప్రయాణికులకు రవాణా సేవలను మరింత మెరుగుపరచడానికి తగిన కృషి చేయడం జరుగుతుందనీ, బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం టీఎస్‌ ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement