Wednesday, April 24, 2024

కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఫాంహౌస్ నుంచి తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో బహుజన ఎంప్లాయీస్ మీట్‌కు హాజరైన ఆయన.. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే పరిస్థితులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో రూ. 50 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు దోచుకున్న డబ్బులతో పేదలకు ఉచితంగా ఆండ్రాయిడ్ ఫోన్‌ పంపిణీ చేయవచ్చని సెటైర్లు వేశారు.

మరోవైపు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏనాడు కూడా దళితుల పేరు ఎత్తని కేసీఆర్.. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ఆర్థిక సాయం అంటూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఉపఎన్నిక కోసం ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారని.. కేసీఆర్‌ తన అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తారని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకం కావాలని.. అప్పుడే దొరల పాలన పోయి సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. తనకు అధికారంపై ఆశలు లేవని.. బహుజనులను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని వెల్లడించారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement