Friday, March 29, 2024

IPS పదవీకి RS ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా..

ఐపీఎస్ అధికారి, రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్ తన పదవీకి రాజీనామా చేశారు. ఓవైపు బాధ, మరోవైపు ఆనందం కలగలిసిన భావాల నడుమ తన 26 ఏళ్ల కెరీర్ కు గుడ్ బై చెబుతున్నానని తెలిపారు. ఐపీఎస్ అధికారి అవ్వాలనేది తన ఆశయం అని, ఆ స్థాయిని అందుకున్న తాను ఇప్పుడు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఇదేమంత సులభమైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు పంపించినట్టు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

 స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నట్లు ట్వీట్ చేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. గత 26 సంవత్సరాలుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయనకు 6 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఎంతో ఆదర్శభావాలున్న వ్యక్తిగా ప్రవీణ్ కుమార్ గుర్తింపు పొందారు. అయితే ఎల్ల వేళల తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కుటుంబానికి రుణపడి ఉంటానని ప్రవీణ్ కుమార్ తెలిపారు. బంధుమిత్రులు, గురువులు, సహచరులు, విద్యార్థులు, ప్రజానీకం, ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు… ఇలా ఎందరో తన వ్యక్తిత్వాన్ని మలిచారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. బడుగు, బలహీన వర్గాలకు సేవలు అందించేలా తనకు అవకాశాలు ఇచ్చిన ఉమ్మడి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు అంటూ తన లేఖలో పేర్కొన్నారు.

పోలీసులకు, సంక్షేమ విభాగాలకు, గురుకుల పాఠశాలల సిబ్బందికి, గురుకుల పాఠశాలల విద్యార్థులు (స్వేరోస్) అందరికీ వేనవేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఇకపై తన శేష జీవితాన్ని మహాత్మా పూలే దంపతులు, అంబేద్కర్, కాన్షీరామ్ వంటి మార్గదర్శకుల ఆశయాలకు అనుగుణంగా కొనసాగిస్తానని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. తన జీవితంలో కొత్త దశ ప్రారంభం అవుతోందని, అందరి ఆశీస్సులు కావాలని తెలిపారు.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులారా..నోటిఫికేషన్లు రానున్నాయి: మంత్రి నిరంజన్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement