Friday, April 19, 2024

Big Relief | సుప్రీంలో యోగి సర్కార్‌కు ఊరట.. ఓబీసీ రిజ‌ర్వేష‌న్లు లేకుండానే ఎన్నిక‌ల‌కు

స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి గొప్ప ఊరట లభించింది. ఓబీసీ రిజర్వేషన్లు లేకుండానే జనవరిలోగా ఎన్నికలు జరపాలన్న అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. ఓబీసీల రాజకీయ వెనుకబాటుతనంపై మార్చి 31లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ను సీజేఐ డీవైచంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్‌ నరసింహన్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్‌చేస్తూ సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది.

ప్రత్యేక ఓబీసీ కమిషన్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశామని, మార్చి నాటికి నివేదిక ఇస్తామని తెలిపింది. డిసెంబర్‌లో పట్టణ సంస్థల ఎన్నికలలో ఓబీసీలకు రిజర్వేషన్లను హైకోర్టు నిరోధించింది. రిజర్వేషన్‌ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 17 మున్సిపాలిటీలు, 200 మున్సిపల్‌ కౌన్సిల్‌లు, 545 నగర పంచాయతీల మేయర్ల కోసం రిజర్వు సీట్ల తాత్కాలిక జాబితాను జారీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యపై అభ్యంతరం వ్యక్తంచేసిన పిటిషన్‌ను అనుసరించి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. రాజకీయ రిజర్వేషన్లను నిర్ణయించే ముందు ఓబీసీలపై సమకాలీన డేటా సేకరించేందుకు రాష్ట్రాలు ట్రిపుల్‌ టెస్ట్‌ సర్వే నిర్వహించాలని 2021లో సుప్రీంకోర్టు ఆదేశించింది. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం రాజకీయ వెనుకబాటుతనంతో ఏకీభవించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement