Saturday, April 20, 2024

75 రూపాయల కాయిన్​ విడుదల.. రేటు మాత్రం 75 కాదండోయ్​!

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 75 రూపాయల నాణేన్ని నిన్న (ఆదివారం) విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నాణెం బరువు 34.65 నుంచి 35.65 గ్రాముల వరకు ఉంటుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ గెజిట్ నోటిఫికేషన్ తెలిపింది. ఈ నాణేనికి ఒక వైపు జాతీయ చిహ్నం, దేవనాగరి లిఫిలో రాసిన భారత్ అనే పదంతో పాటు ఆంగ్లంలో ఇండియా అని రాసి ఉంటుంది. మరో వైపు నూతన పార్లమెంటు కాంప్లెక్స్ చిత్రంతో పాటు 2023 అని ముద్రించి ఉంటుంది.

అయితే ఈ రూ. 75 నాణేన్ని తయారు చేసేందుకు 50 శాతం వెండి, 40 శాతం కాపర్, 5 శాతం నికేల్, 5 శాతం జింక్ ను ఉపయోగించారు. ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని జ్ఞాపికలుగా రూపొందించే ఈ నాణేలు సాధారణంగా మార్కెట్లో చెలామణిలో ఉండవు. వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. 1964 నుంచి ఇప్పటివరకు మొత్తం 150 ప్రత్యేక నాణేలను తయారు చేశారు.

- Advertisement -

కేంద్రం ప్రత్యేకంగా తయారు చేయించే ఈ నాణేలును www.indiagovtmint.in అధికారిక వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా డీడీ ద్వారా వీటిని కొనే వీలుంటుంది. క్యాష్, చెక్ ద్వారా కొనేందుకు అనుమతించరు. అలాగే మీరు 10 నాణేల కంటే ఎక్కువ కొనుగోలు చేయాలనుకుంటే పాన్ కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది. అయితే రూ.75 నాణెం ధరను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్ర‌కటించ‌లేదు. అయితే ఈ నాణెం తయారీలో వినియోగించిన మెటీరియల్ కే రూ.1,300 అవుతుందని బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యోగేశ్ సింగ్వాల్ తెలిపారు. దీని ఖరీదు ఎంత ఉంటుందో కేంద్రమే కొద్ది రోజుల్లో ప్రకటిస్తుందన్నారు.

కాగా ఇప్పటివరకు కేంద్ర ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికల్లో రూ.100 నాణెం అత్యధిక ధర పలికింది. ప్రసిద్ధ భారతీయ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ హోమీ జే బాబా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విడుదల చేసిన‌ రూ.100 నాణెం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.18,561 గా నిర్ణయించారు. అలాగే జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీ లాల్ నెహ్రూ 150 జయంతి సందర్భంగా రూపొందించిన రూ.150 నాణెం ధర రూ.10,890 గా ఉంది. మరి రూ.75 నాణెం ధరను కేంద్రం ఎంతగా నిర్ణయిస్తుందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement