Thursday, April 18, 2024

తెలుగు అకాడమీ పేరు మార్చడం దారుణం: ఎంపీ రఘురామ

సీఎం జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి బహిరంగ లేఖ రాశారు. తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చడాన్ని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుపట్టారు. ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. కీలకమైన నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోవడం సరికాదని, ఈ విషయంపై ప్రజలు, నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవాలని సీఎం జగన్‌కు సూచిస్తున్నట్లు రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.

ఎలాంటి సమస్యనైనా ఒకే కోణం నుంచి మాత్రమే చూసే జగన్‌కు రెండో కోణం గురించి చెప్పేందుకే తాను ప్రయత్నిస్తున్నానని రఘురామ తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని జగన్‌కు అర్థం అయ్యేలా చెప్పేందుకు తన వంతుగా చేస్తున్న ప్రయత్నమిదని అన్నారు. తెలుగు అకాడమీని పలుచన చేయడం ద్వారా తెలుగు ప్రజలకు జగన్ ఏం సందేశాన్ని ఇవ్వాలనుకున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ప్రాథమిక విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టాలని మీరు శతవిధాలా ప్రయత్నం చేసినప్పుడే మీరు తెలుగు భాషను తుడిచిపెట్టే సాహసం చేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందారని… ఆ ఆందోళనకు కొనసాగింపుగా ఇప్పుడు తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని చేర్చే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సంస్కృతానికి పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పడం… తల్లికి అన్నం పెట్టనివాడు పినతల్లికి పట్టుచీర తెచ్చాడన్నట్టుగా ఉందని రఘురాజు ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారు మాత్రమే కాకుండా… ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.

ఈ వార్త కూడా చదవండి: సీఎం జగన్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement