Tuesday, April 23, 2024

పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు?: పేర్ని నానికి రఘురామ ప్రశ్న

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో సున్నితమైందని, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌పై మంత్రి పేర్ని నాని అనవసరంగా కొన్ని మాటలు మాట్లాడారని, ఆయన అనసవరంగా కుల ప్రస్తావన తీసుకువచ్చారని తెలిపారు. కుక్కలు, గ్రామ సింహాలు, వరాహాలు అంటూ కామెంట్లు చేసుకోవడం సరికాదని హితవు పలికారు. కానీ పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వైవాహిక సంస్కారాలు అనే వ్యాఖ్య చేయడం నీచాతినీచమైన సంస్కృతి అని అన్నారు.

గతంలో పవనే దీని గురించి చెప్పారని, కొందరికి అదృష్టం ఉంటుందని, కొందరికి అదృష్టం ఉండదని, మనసులు కలవక విడిపోవడం సహజమేనని రఘురామ పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ద్వారా మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని తెలిపారు. ఎదుటి వ్యక్తి వైవాహిక జీవితం గురించి ఎత్తిచూపేటప్పుడు ఒక వేలు చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయని, ఈ విషయాన్ని పేర్ని నాని, పోసాని వంటి వాళ్లు తెలుసుకోవాలని హితవు పలికారు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది? ఇక్కడ ఎవడు పత్తిత్తు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నాన్సెన్స్ నిలిపివేయాలని పేర్ని నానికి విజ్ఞప్తి చేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు. సినీ రంగ వివాదం పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రం నుంచే ప్రారంభమైందన్నది వాస్తవం అని స్పష్టం చేశారు. ప్రభుత్వం సీఎఫ్ఎంస్ పోర్టల్‌ను చక్కదిద్దుకోకుండా, సినిమా రంగం తరఫున టికెట్లు అమ్మడం కోసం పోర్టల్ ఏర్పాటు చేయడం అవసరమా? అని రఘురామ ప్రశ్నించారు. ఇప్పటికే కోర్టు కేసుల్లో న్యాయవాదులకు కోట్లు చెల్లిస్తున్నారని, ఇప్పుడీ దుబారాలు ఎందుకని రఘురామ నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement