Friday, March 29, 2024

మా ఇంట్లో ఈడీ ఆఫీసు పెట్టుకోండి.. బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌

‘‘ఈడీ, ఆదాయం పన్ను శాఖ, సీబీఐల‌కు నేను ఆహ్వానం అందిస్తున్నా.. వాళ్లు నిక్షేపంగా మా ఇంటి వద్దనే ఆఫీసులు తెరుచుకోవచ్చు. ఇప్పుడు వెళ్లి, మరో రెండు నెలల తర్వాత సోదాల పేరిట రావడమెందుకు? మాతోనే కలిసి ఉండొచ్చు’’
– తేజస్వీ యాదవ్‌

ఈడీ అధికారులు తమ ఇంటికి వచ్చి అక్కడే ఆఫీసును తెరుచుకోవచ్చని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు. బిహార్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన జాతీయ మీడియా చానల్‌ ఎన్డీటీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మీ చానల్‌ (ఎన్డీటీవీ) ద్వారా నేను ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, సీబీఐకి ఆహ్వానం అందిస్తున్నా.. వాళ్లు నిక్షేపంగా మా ఇంటి వద్దనే ఆఫీసులను తెరుచుకోవచ్చు. ఇప్పుడు వెళ్లి.. మరో రెండు నెలల తర్వాత సోదాల పేరిట రావడమెందుకు? మాతోనే కలిసి ఉండొచ్చుగా’ అన్నారు. ఈడీ, సీబీఐ.. బీజేపీ పార్టీ సెల్ మాదిరిగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు తేజ‌స్వీ.

ఇక‌.. నితీశ్‌తో జట్టుకట్టడం గురించి స్పందిస్తూ.. ముందస్తు ప్లాన్‌లో భాగంగా తాము కలవలేదని, అనుకోకుండానే ఇది జరిగిందన్నారు. బీజేపీతో కలిసి ఉన్నంతకాలం నితీశ్‌ అసౌకర్యంగా ఉన్నారని పేర్కొన్నారు. 2024లో ప్రధాని అభ్యర్థిగా నితీశ్‌ పోటీచేయవచ్చా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘మోదీనే ప్రధాని అయినప్పుడు.. నితీశ్‌ ఎందుకు కాకూడదు?’ అని ఎదురు ప్రశ్నించారు. బీజేపీని గద్దె దించేందుకు విపక్ష పార్టీలన్నీ కలిసిరావాలని, ఈ మేరకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే ఆలస్యం చేశామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement