Thursday, March 28, 2024

12 కోట్ల పనిదినాలు కల్పించండి : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఆర్ధిక సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు అవసరం అవుతున్నాయని, ఈ పనిదినాలను కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రానికి విజ్ణప్తి చేశారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహణ, రోడ్ల మరమ్మత్తులు, కొత్త రోడ్ల పనుల పురోగతిపై, ఉపాధి హామీ పథకంలో కల్పించే పనిదినాలు, మెటీరియల్ కాంపోనెంట్ పనులు – నిధులపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని మంత్రి చాంబర్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావు, ఉపాధి హామీ పథకం స్పెషల్ కమిషనర్ ప్రసాద్ లతో సమీక్ష చేశారు. పంచాయతీరాజ్ కింద మంజూరు చేసిన సీసీ రోడ్ల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు వేగవంతం చేసేందుకు ఎక్కువ మందిని పనిలో పెట్టుకోవాలన్నారు. పీఆర్ రోడ్ల మరమ్మత్తు పనులకు సంబంధించి టెండర్లు పిలవని జిల్లాల్లో వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. అదే విధంగా మొదటి సారి టెండర్ కాల్ ఫర్ చేసిన చోట్ల స్పందన లేకపోతే వెంటనే రెండోసారి టెండర్లను పిలవాలన్నారు. ఉపాధి, హామీ పథకం కింద ఈ సంవత్సరంలో 10.5 కోట్ల పనిదినాలు పూర్తి చేశామని, వీటిని 12 కోట్ల పనిదినాలకు పెంచాలని కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు దాదాపు 800 కోట్ల రూపాయలు కేంద్రం ఇంకా విడుదల చేయలేదని, ముఖ్య కార్యదర్శి, అధికారులు ఢిల్లీకి వెళ్లి ఈ నిధుల విడుదల కోసం కృషి చేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement