Thursday, April 25, 2024

నా కోడికి ర‌క్ష‌ణ క‌ల్పించండి.. కేసు పెట్టిన మ‌హిళ‌

త‌న కోడికి ర‌క్ష‌ణ క‌లిపించాల‌ని పోలీసు కేసు పెట్టింది ఓ మ‌హిళ‌. రాయ్‌పూర్‌ జిల్లాకు తూర్పున 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిలాస్‌పూర్‌లోని రతన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు నమోదు అయ్యింది. పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న సిల్దాహా గ్రామానికి చెందిన జాంకీబాయి బింజ్వార్ అనే మహిళ దేశీయ కోళ్లను పెంచుతుంటుంది. ఆమెకు కోళ్ల పెంపకం అంటే ఎంతో ఇష్టం. అయితే ఆమెకు ఉన్న కోళ్లలో ఒక కోడిని ఆమె పొరిగింటివారు దొంగించడానికి ప్రయత్నించారు. కానీ వారు విఫలమయ్యారు. దీంతో కోడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కానీ దానికి గాయాలు అయ్యాయి. దీనిని జాంకీబాయి గమనించింది. ఈ పరిణామం పట్ల ఆగ్రహించిన ఆ మహిళ.. కోడిని తీసుకొని నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లింది. తన కోడిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే తన కోడికి రక్షణ కల్పించాలని కోరింది.
ఈ విషయంలో రతన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రసాద్ సిన్హా మాట్లాడుతూ.. ఆ మహిళ గాయపడిన కోడితో పోలీస్ స్టేషన్‌కు వచ్చిందని చెప్పారు. మహిళ ఫిర్యాదును స్వీకరించామని అన్నారు. ఆమె ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ కేసులో ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement