Thursday, March 28, 2024

దేశ ఆర్థికస్థితిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం.. సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు ఎక్కడ సిద్ధమో కేసీఆర్ చెప్పాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితులు, జీడీపీపై అసత్యాలు, అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవ పరిస్థితులపై చర్చించేందుకు రావాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. గౌరవప్రదమైన భాషలో మాట్లాడతానంటేనే చర్చకు వస్తానని నొక్కి చెప్పారు. ప్రగతి భవన్, ఫామ్ హౌజ్, ప్రెస్ క్లబ్, అసెంబ్లీ ముందున్న అమర వీరుల స్తూపం ఎక్కడైనా తాను సిద్ధమేనన్నారు. రాష్ట్రం కోసం కల్వకుంట్ల కుటుంబం ఏం చేసిందో చెప్పుకోకుండా అసెంబ్లీని బీజేపీని, మోదీని తిట్టేందుకు వేదికగా, ఓ పొలిటికల్ సమావేశంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లడమే ఏకైక టార్గెట్ గా సమావేశాలు నిర్వహించారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం, బీజేపీని ప్రజలు ఆదరిస్తుండటాన్ని కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారనే విషయం ఆయన మాటల్లోని నిరాశ, నిస్పృహ, నిర్వేదం ద్వారా స్పష్టమవుతోందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శాసన మండలిలో కాంగ్రెస్‌ను లేకుండా చేసిన కేసీఆర్, శాసనసభలోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా తన పార్టీలోకి లాక్కున్నారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ సర్కారును, ఇందిరాగాంధీ పాలనను పొగుడుతూ వ్యాఖ్యలు చేయడమే ఆయన కాంగ్రెస్‌తో జత కట్టే ఆలోచనలో ఉన్నారనడానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. యూపీఏ హయాంలో దేశం అవినీతి కోరల్లో చిక్కుకుపోతే, ఆ పాలనను ప్రశంసిస్తూ కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మన్మోహన్ సింగ్ పాలనలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్.. మోదీ గారు వచ్చాక 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం కేసీఆర్‌కు కనిపించడం లేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

ఏ ఎండకు ఆ గొడుగు..

- Advertisement -

కేసీఆర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని, మొన్నటివరకు కేంద్ర ప్రథకాలను అద్భుతమంటూ కీర్తించిన నోటితోనే ఇప్పుడు కాంగ్రెస్ పాట పాడుతున్నారని ధ్వజమెత్తారు. కమ్యూనిస్టులను తిట్టిన నోటితోనే ఇప్పుడు పొగుడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు ఏడెనిమిది నెలల ముందే కల్వకుంట్ల కుటుంబం రాజీనామా చేసేందుకు తొందరపడాల్సిన పనిలేదని, ఆ తర్వాత ఎలాగూ గవర్నర్‌కు రాజీనామా ఇవ్వక తప్పదని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థను, తలసరి ఆదాయాన్ని బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, సింగపూర్ దేశాలతో పోల్చడం కేసీఆర్ అవగాహనా రాహిత్యమని, ఏ ఆర్థికవేత్తకు కూడా అర్థం కాని రీతిలో ఎటువంటి ఆధారాలు లేకుండా పచ్చి అబద్దాలు మాట్లాడారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. విదేశాల జీడీపీ గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి హైదరాబాద్, రంగారెడ్డిలో తలసరి ఆదాయమెంత? ఆసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లాలో తలసరి ఆదాయమెంతో కూడా చెప్పాలన్నారు. అప్పులు చేసి కమిషన్లు కొట్టేసే ప్రభుత్వం కేంద్రంలో లేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానాలిచ్చారు.

జమ్ము కశ్మీర్‌లో అంబేద్కర్ రాజ్యాంగం..

విభజనం చట్టంలో ఉన్నంత మాత్రాన అన్నీ అమలు కావని, రాజ్యాంగం ప్రకారమే కేంద్రం నడుచుకోవాలని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఇన్నాళ్లూ ఆర్టికల్ 370ని అడ్డంపెట్టుకుని జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేశారన్న ఆయన, కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని చెప్పుకొచ్చారు. దేశమంతా నియోజకవర్గాల పునర్విభజన జరిగినపుడు, జమ్మూ కశ్మీర్‌లో జరగలేదని, అందుకే ప్రస్తుతం అక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందని వెల్లడించారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అమలయ్యేలా చూడటం, అందరికీ న్యాయం జరిగేలా పని చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement