Thursday, April 25, 2024

ప్రధాని మోదీని వ్యతిరేకించిన ఆయన తమ్ముడు ప్రహ్లాద్ మోదీ

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆయన సోదరుడు గళమెత్తారు. ఈ సందర్భంగా ఆయన జీఎస్టీపై ఆయన ఆరోపణలు చేశారు. ఆలిండియా ఫెయిర్ ప్రైస్ షాప్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఆయన మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాసన్‌నగర్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాపారులు తమ సమస్యలను సరైన మార్గంలో మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పోరాడాలని, అప్పటికీ వినకుంటే అప్పుడు జీఎస్టీ కట్టడం మానేయాలని సూచించారు. అప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, నరేంద్ర మోదీ మీ ఇంటికే వస్తారని అన్నారు.

‘నరేంద్రమోదీ కానీయండి, మరొకరు కానీయండి. ఎవరైనా సరే మొదట మీ సమస్యలను వినాలి. కాబట్టి ఈ రోజు నేను మీకు చెబుతున్నది ఒకటే. సమస్యలను పరిష్కరించేంత వరకు జీఎస్టీ కట్టబోమని తొలుత మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనమేమీ బానిసలం కాదు’’ అని ప్రహ్లాద్ మోదీ అన్నారు. తాను దేశవ్యాప్తంగా 6.50 లక్షల ఫెయిర్ ప్రైస్ దుకాణ యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ.. కరోనా, లాక్‌డౌన్ తమను ఎలా దెబ్బతీసిందీ వివరించారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించామంటూ పోలీసులు తమపై కేసులు నమోదు చేస్తున్నారని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: వీడియో: రైలు ఎక్కుతూ కింద పడిన మహిళ

Advertisement

తాజా వార్తలు

Advertisement