Thursday, April 25, 2024

Followup | పోలవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.. పనులను పరిశీలించిన సీఎం జగన్‌

ఏలూరు ప్రభ న్యూస్‌ బ్యూరో : పోలవరాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, నిర్వాసితుల పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించిన అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రాజెక్ట్‌ అధికారులు ఇంజనీర్లు ప్రాజెక్టు నిర్మాణ పనులను సమగ్రంగా ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను సైతం ఆయన పరిశీలన జరిపి తదుపరి సంభంధిత అధికారులతో సమగ్రంగా సమీక్ష జరిపారు.

ఇటీవల కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ ఆధ్వర్యంలో జల శక్తి సంఘం 2025 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలోనూ పనులను పూర్తిచేసేందుకు గాను 12911 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏరియల్‌ సర్వే ఫోటో ఎగ్జిబిషన్‌ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సంబంధిత ఇంజినీర్లు అధికారులతో సమీక్షించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌, దిగువ కాఫర్‌ డ్యామ్‌ దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ వద్ద జరుగుతున్న పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. గత సీజన్లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తులు తట్టుకునేందుకు ఎగువకాఫర్‌ డ్యాం ఎత్తు పెంపు పనులను సైతం ఆయన పరిశీలించారు. అలాగే ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న దిగువ కాఫర్‌ డ్యాంను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు.

వైబ్రో కాంప్లెక్స్‌ పనులను డయాఫ్రమ్‌ వాల్‌ ప్రాంతంలో నిర్మాణ పనులను ఈసీఆర్‌ఎఫ్‌ డాం నిర్మాణాలపై నా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు తొలివిడత ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు అవసరం అయిన నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని 12,911.15 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు అధికారులు వి వరించారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో నిర్మాణాల కోసం అదనంగా మరో రెండు వేల కోట్లు ఇచ్చిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కాంపౌండ్‌ వారీ బిల్లులు చెల్లింపు వల్ల ప్రాజెక్ట్‌ నిర్మాణాలు ఆలస్యం అవుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్రం మినహాయింపులు కూడా ఇచ్చిన విషయాన్ని వివరించారు. గైడ్‌ వాల్‌ దెబ్బతిన్న విషయం పై సమీక్ష నిర్వహిస్తూ గైడ్‌ వాల్‌ డిజైన్లను కేంద్ర జల సంఘం సి డబ్ల్యూ సి ఖరారు చేసిందని వారి ఆమోదంతోనే పనులు చేశామని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

కేంద్రానికి పరిస్థితులను నివేదించామని దీన్ని సరిదిద్దడం పెద్ద సమస్య కాదని సిడబ్ల్యూసి పరిశీలన కాగానే వారి సూచనలు మేరకు మరమ్మతులు చేపడతామని అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో సహజంగానే చిన్న సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి చెబుతూ వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు సాగాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలారని ఈ ఖాళీలు గుండా వరదనీరు అతివేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఎఫ్‌ డాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రం వాల్‌ దారుణంగా దెబ్బతిన్నారు. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాదు అదనంగా 2000 కోట్లు- రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టులో కీలక పనులు ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. స్పిల్‌ వే కాంక్రీట్‌ పూర్తయిందని 48 రేడియల్‌ గేట్లు పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగిందని రివర్‌ స్లూయిస్‌ గేట్లు పూర్తయ్యాయని ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డాం పూర్తయిందని గ్యాప్‌ 3 వద్ద కాంక్రీట్‌ డ్యాం పూర్తయిందని అలాగే పవర్‌ హౌస్‌ లో సొరంగాల తవ్వకం పూర్తయిందని అప్రోచ్‌ ఛానల్‌ పనులు దాదాపుగా పూర్తిగా వచ్చాయని వివరించారు. దెబ్బతిన్న గ్యాప్‌ వన్‌ ప్రాంతంలో ఇసుక నింపే కార్యక్రమం పూర్తయినట్లు ఆ ప్రాంతంలో వైబ్రో కాంపెక్షన్‌ కూడా పూర్తయిందని పేర్కొన్నారు. ఈసిఆర్‌ఎఫ్‌ గ్యాప్‌ 2 ప్రాంతంలో నింపడానికి అవసరమైన 100??? ఇసుక రవాణా పూర్తి అయినట్లు అధికారులు వివరించారు.

నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం నిర్వాశితులందరిని వీలైనంత త్వరగా తరలించాలని సీఎం ఆదేశించారు దెబ్బతిన్న డయాఫ్రం వాళ్ళని త్వరగా పూర్తి చేయాలని ఇది పూర్తి అయితే మెయిన్‌ డాంచురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. డిసెంబర్‌ కల్లా పనులు పూర్తి చేయడానికి కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు- అధికారులు వివరించారు నిర్వాసిత కుటుంబాలకు పునరావసంపై సమీక్షిస్తూ పునరావాస కాలనీలో అన్ని అన్నిసౌకర్యాలు ఏర్పాటు- చేయాలని సీఎం ఆజేశించారు.

కాలనీలు పూర్తవుతున్న సమయంలోనే సమాంతరంగా సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు తెలపగా షెడ్యూల్‌ ప్రకారం నిర్వాసిత కుటుంబాల అందరిని తరలించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దాలని, పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలని పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలు ఇక్కడ హోటల్‌ ఏర్పాటు కూడా చేయాలని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా పోలవరం పర్యటనకువచ్చిన ముఖ్యమంత్రిని రాష్ట్ర మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరావు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జిల్లా కలెక్టర్‌ వై ప్రసన్న వెంకటేష్‌ ప్రాజెక్ట్‌ అధికారులు ఇంజనీర్లు వైసిపి నాయకులు పలువురు ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement