Saturday, April 20, 2024

క్రీడల్లో గెలుపోట‌ములు స‌మాన‌మే.. సిఐ కరుణాకర్ రావు..

తొర్రూరు టౌన్ ప్రభాన్యూస్ : క్రీడలపై యువత ఆసక్తి పెంపొందించుకొని.. ఆ రంగంలో రాణించాలని సిఐ కరుణాకర్ రావు, జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని యతి రాజారావు పార్కు మైదానంలో తెలంగాణ బేడ బుడగ జంగాల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వాహకులు తూర్పాటి సాయి ముఖేష్,తూర్పాటి మెండిస్ లతో కలిసి జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..క్రీడాకారులు గెలుపు.. ఓటములను సమానంగా భావించి, క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలని అన్నారు. క్రీడలు దేహధారుడ్యాన్ని పెంపొందిస్తాయని, స్నేహ పూరిత వాతావరణంలో క్రీడా పోటీల్లో పాల్గొనాలన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం  ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మించేందుకు కృషి చేస్తోందన్నారు.క్రీడాకారులను, కోచ్ లను రాష్ట్ర క్రీడా శాఖ ప్రోత్సహిస్తుందన్నారు.తెలంగాణను క్రీడాహబ్‌గా రూపొందించేందుకు సీఎం కేబినెట్‌ సబ్‌కమిటీని నియమించారన్నారు. క్రీడల సమగ్రాభివృద్ధి సాధించే దిశగా అత్యున్నతమైన నూతన క్రీడా విధానాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందు కోసం వివిధ దేశాల క్రీడా పాలసీలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహం కోసం క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2శాతం, ఉన్నత విద్య కోసం 0.5శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్, టిఆర్ఎస్ యూత్ జిల్లా నాయకులు ముద్దసాని సురేష్,నాయకులు మాడుగుల పూలమ్మ ,కిన్నెర పాండు, రాయి శెట్టి వెంకన్న, టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బసన బోయిన మురళి యాదవ్, ఉపేందర్, క్రీడాకారులు స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement