Thursday, April 25, 2024

ఫాంహౌజ్ నిందితుల కేసుపై పిటిష‌న్‌.. సుప్రీంకోర్టులో విచారణ 21కి వాయిదా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణలపై అరెస్టయిన నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. నిందితులు రామచంద్ర భారతి అలియాస్ వీకే సతీశ్ శర్మ, నందు కుమార్, సింహయాజి స్వామి ట్రయల్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రతివాదిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టులో కేసు విచారణ వాయిదా వేయాలని ధర్మాసనాన్ని కోరారు.

తెలంగాణ పోలీసులు ఈ కేసులో రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు రిమాండ్ తిరస్కరించిన రెండ్రోజుల్లోనే హైకోర్టు పూర్తి భిన్నమైన ఆదేశాలు ఎలా ఇస్తుందని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరో సందర్భంలో రాజకీయ విబేధాలకు న్యాయస్థానాలను వేదిక చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. సోమవారం విచారణ జరగకుండానే వాయిదా కోరడంతో ధర్మాసనం తదుపరి విచారణ ఈనెల 21కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement