Wednesday, April 24, 2024

భేవకూఫ్ ఎవరో ప్రజలే తేల్చుతరు.. పసుపు బోర్డు పేరుజెప్పి దొంగ బాండ్ పేపర్ రాసిచ్చిన‌వ్‌

ఉమ్మడి నిజామాబాద్, ప్రభన్యూస్ బ్యూరో : ప్రజల ప్రక్షాన ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే జవాబు చెప్పకుండా నన్ను భేవకూఫ్ అని తిడతావా అంటూ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భేవకూఫ్ ఎవరో ప్రజలు త్వరలోనే నిర్ణయిస్తారని చురక అంటించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఆదివారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి వేముల‌ అన్నారు.

ఒక్కరోజే రూ. 6 కోట్ల అభివృద్ధి పనులు చేసుకున్నామని చెప్పారు. అభివృద్ది చేస్తున్నది ఎవరు ? మాటలు చెప్తున్నది ఎవరు ? అని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. అరవింద్ ఎంపీగా ఎన్నికైంది ఈ ప్రాంతం అభివృద్ధి కోసమే.. కానీ వ్యక్తిగతంగా దూషించడం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తిట్టిన పర్వాలేదు కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. కులాలు,మతాల మధ్య చిచ్చుపెట్టి సమాజాన్ని విడగొట్టే మాటలు మానుకోవాలని మంత్రి తవు పలికారు.

పసుపు బోర్డుపై దొంగ బాండ్ పేపర్ రాసిచ్చిన ఎంపీ..

- Advertisement -

పసుపు బోర్డు తెస్తా అని దొంగ బాండ్ పేపర్ రాసిచ్చి, పసుపున‌కు రూ. 10వేల మద్దతు ధర ఇప్పిస్తా అని రైతులను మోసం చేసిన మోసకారి అర్వింద్ అని మంత్రి దుయ్యబట్టారు. దొంగ హామీలతో గెలిచిన నీవల్ల గెలిపించిన ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. తాను పేద ప్రజలకు సిఎంఆర్ఎఫ్ ఇప్పించినట్లు.. అర్వింద్ కూడా ప్రధాని నుంచి పిఎంఆర్ఎఫ్ ఇప్పించాలని అడిగితే వ్యక్తిగత దూషణలు చేస్తున్నాడని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కు సైకిల్ మోటార్ ఉన్న కుటుంబం అర్హులు కారని,ఈ రోజుల్లో సైకిల్ మోటార్ లేని ఇల్లు ఉన్నదా అని మంత్రి ప్రశ్నించారు.

ఆరోగ్య శ్రీ , ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి రానివి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేసుకున్న పేద ప్రజలకు తాను కేసిఆర్ ను అడిగి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక్క బాల్కొండ లోనే 10 వేల మందికి రూ. 40 కోట్లు రూపాయలు ఇప్పించానని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రధాని మోడీ పీఎం సహాయ నిధి నుంచి పేదలకు ఏమైనా ఆర్ధిక సహాయం చేశావ అని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం నేను చేస్తున్నట్లుగా, ఎంపీ కూడా సహాయం చేయాలని ప్రశ్నిస్తే బేవకుఫ్ అని తిడుతున్నాడని మంత్రి వేముల అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, గతంలో ఒక్కసారి చేసిన పొరపాటు ప్రజలు మళ్లీ చేయకుండా అన్ని విషయాలు గ్రహిస్తున్నారని మంత్రి వేముల అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement